గవర్నర్తో చంద్రబాబు ఏకాంత భేటీ, దాదాపు గంట చర్చలు: ఈ అంశాలపై చర్చ!
అమరావతి: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం భేటీ అయ్యారు. ఇరువురు దాదాపు నలభై నిమిషాల నుంచి గంటసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా గవర్నర్ అమరావతికి వచ్చారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక ఇరువురు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అలాగే, ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి, సిట్ దర్యాఫ్తు, బీజేపీ నేతల తీరుపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
టిట్లీ తుఫాను సహాయంపై కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని గవర్నర్కు ముఖ్యమంత్రి చెప్పారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. కేంద్రం సహకారం లేకపోవడం వల్లే కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులను పఏపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు.
మంత్రివర్గ విస్తరణకు ముందు గవర్నర్, ముఖ్యమంత్రిలు కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వచ్చిన ప్రతిసారి చంద్రబాబు కలిసి వెళ్లేవారు. కానీ ఈసారి ఆయనను కలవలేదని, మంత్రివర్గ విస్తఱణ సందర్భంగా కూడా గవర్నర్తో ఏ అంశాలు చర్చించలేదని, కొత్త మంత్రుల పేర్లను గవర్నర్ ఆమోదానికి సీఎంవో అధికారులు పంపించారని, చంద్రబాబు చర్చించలేదనే వాదనలు వినిపించాయి. అయితే, ప్రమాణ స్వీకారం అనంతరం ఇరువురు దాదాపు గంటసేపు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి వ్యవహారంలో గవర్నర్ తీరుపై చంద్రబాబు సహా టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కలయికపై ఊహాగానాలు, భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.