కీలక పరిణామాలు: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను కాదన్నారేంటి!: బాబు, తలపై చేయిపెట్టి మాయావతి..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నేత శరద్ యాదవ్, సీపీఐ నేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు శనివారమంతా బిజీగా గడిపారు.
ఏపీ భవన్లో తొలుత శరద్ యాదవ్ను ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్మీట్ నిర్వహించారు. సాయంత్రం అయిదు గంటల సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. దాదాపు ముప్పావు గంట మాట్లాడారు.
మాయావతితో చంద్రబాబు భేటీ
ఆ తర్వాత మాయావతి ఇంటికి వెళ్లి ఆమెతో దాదాపు గంట పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీలు బలపడాలని మాయావతి, చంద్రబాబు ఆకాంక్షించారు. ఏడు గంటలకు ఏపీ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాతో భేటీ అయ్యారు. ఎనిమిది గంటలకు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, కార్యదర్శి కె నారాయణ, ఎంపీ డి రాజాలు ఏపీ భవన్కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
చంద్రబాబు కారు వరకు వచ్చి వీడ్కోలు, తలపై చేయి పెట్టి ఆశీర్వాదం
మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేయడానికి మాయావతి ఓకే చెప్పారు. సమావేశం అనంతరం సాధారణంగా ఎప్పుడూ బయటకురాని మాయావతి ఈసారి అనూహ్యంగా కారు వరకు వచ్చి చంద్రబాబుకు వీడ్కోలు పలికారు. ఆయన తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు. చంద్రబాబు కూడా ఆమెకు నమస్కరించారు. ఈ దృశ్యం ఆసక్తిని రేకెత్తించింది.
చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో తెగదెంపులపై
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మిత్రపక్షాల ఐక్యతకు గండికొట్టినట్లు నెపం ఎదుర్కొన్న మాయావతి.. చంద్రబాబుతో సుదీర్ఘంగా సమావేశం కావడం ద్వారా భవిష్యత్తు రాజకీయ సంకేతాలను ఇచ్చింది. సమావేశంలో వాజ్పేయి నాయకత్వానికి, ఇప్పటి మోడీ ప్రభుత్వానికి ఉన్న తేడాలు, జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుల గురించి చర్చించారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో వెళ్లమని చంద్రబాబు సూచన చేశారని తెలుస్తోంది.
కాంగ్రెస్తో విభేదాలు తాత్కాలికమేనని బాబుతో చెప్పిన మాయావతి
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులను మాయావతి.. చంద్రబాబుకు వివరించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని కించపరిచే విమర్శలు చేశారని, సీట్ల సర్దుబాటు సమయంలో లెక్కలేని తనంతో వ్యవహరించారని, రాహుల్ గాంధీని తమ పార్టీ నేత విమర్శిస్తే వెంటనే సస్పెండ్ చేశానని, కానీ వాళ్ల నాయకులు తనపై విమర్శలు చేసినప్పుడు ఆ తరహాలో స్పందించలేదని, ఇదంతా తాత్కాలికమేనని ఆమె చెప్పారని తెలుస్తోంది.
మోడీని రాకుండా చేద్దాం
సాధారణ ఎన్నికల్లో మోడీ రాకుండా చేయడానికి మనమంతా ఒక్కతాటిపైకి రావాలని, మీరు ఎలా చెబితే అలా వెళ్దామని, నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కలుద్దామని, ముఖ్యమైన ప్రాంతీయ పార్టీల నాయకులంతా ఒకే వేదికపైకి వచ్చి, ఒక ప్రణాళికతో ముందుకెళ్దామని, కలిశాం... విడిపోయామన్న భావన రాకుండా నిర్మాణాత్మకంగా అడుగులు వేద్దామని, ఈ ప్రభుత్వంలో అందరిపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతూనే ఉంటాయని, మోడీ మళ్లీ రాకుండా అన్ని ప్రయత్నాలు చేద్దామని మాయావతి.. చంద్రబాబుతో అన్నారట. లోకసభ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి వెళ్తామన్నారు.