అరుదైన ఘట్టం, రాజకీయాల్లో కీలక పరిణామం: రాహుల్ ఇంటికి చంద్రబాబు, భేటీలో ఏం మాట్లాడారంటే?
Recommended Video
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
కీలక పరిణామం: రాహుల్తో భేటీకి ముందు విమానాశ్రయంలో ఆజాద్తో చంద్రబాబు భేటీ
ఇరువురి మధ్య బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరిగాయి. చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, కనమేడల రవీంద్ర బాబు, కంభంపాటి రామ్మోహన్ తదితరులు ఉన్నారు. ఈ భేటీలో జరిగిన సమయంలో రాహుల్ గాంధీ వెంట కొప్పుల రాజు, అహ్మద్ పటేల్ తదితరులు ఉన్నారు.
రాహుల్ గాంధీతో చంద్రబాబు
నారా చంద్రబాబు నాయుడు.. రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. ఇరువురు నేతలు కలిసిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఈ ఫోటోలో చంద్రబాబు, రాహుల్ గాంధీలతో పాటు గల్లా జయదేవ్, కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, కంభంబాటి రామ్మోహన్, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర బాబు తదితరులు ఉన్నారు.
శరద్ పవార్ ఇంటికి చంద్రబాబు
ఢిల్లీలో విమానాశ్రయం దిగగానే చంద్రబాబును కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కలిశారు. ఆ తర్వాత చంద్రబాబు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఫరూక్ అబ్దుల్లాతోను సమావేశమయ్యారు. కేంద్ర రాజకీయ పరిణామాలు, సీబీఐ, ఆర్బీఐ వంటి వ్యవస్థలను నీరుగారుస్తున్నారనే అంశాలపై చంద్రబాబు, పవార్, ఫరూక్ అబ్దుల్లాలు మాట్లాడుకున్నారు.
పవార్, ఫరూక్లతో భేటీ తర్వాత చంద్రబాబు ఏం చెప్పారంటే?
ఈ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పవార్, ఫరూక్లు ఎంతో గొప్ప నేతలు అని చెప్పారు. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో వారితో చర్చించామని చెప్పారు. దేశంలోని వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని చంద్రబాబు అన్నారు. వాటిని సరి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మిగతా పార్టీల నేతలతో కలిసి మాట్లాడుతామని, బీజేపీయేతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. భవిష్యత్తు తరాల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతున్నామని, కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతామన్నారు.
చంద్రబాబును కలిసిన టీ కాంగ్రెస్ నేతలు
అంతకుముందు, ఢిల్లీలోని ఏపీ భవన్లో చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, వీ హనుమంత రావులు కలిశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడారు. రాహుల్ గాంధీని చంద్రబాబు కలవడం శుభపరిణామం అని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోడీ మోసం చేశారన్నారు.
దేశ రాజకీయాల్లో పెను మార్పు
చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు దేశ రాజకీయాల్లో మార్పు తీసుకు రానుందని వీహెచ్ చెప్పారు. గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మేము మద్దతు ఇచ్చామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని చెప్పారు. ఇద్దరి భేటీ శుభపరిణామం అని షబ్బీర్ అలీ కూడా అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి.