నిమిషం ఆలోచించకుండా అశోక్ గజపతిరాజు రిజైన్, పవన్ నిన్న పొగిడారు: బాబు, హడలిన ప్రజలు!
Recommended Video
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో కుట్రదారులైన బీజేపీని, పాత్రధారులైన వైయస్సార్ కాంగ్రెస్, జనసేనలను చిత్తుచిత్తుగా ఓడించాలని, తద్వారా వారికి బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీకి తాను ఒక్కటే చెప్పదల్చుకున్నానని, టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్దార్ అన్నారు. మీ కుట్రలు ఏ రాష్ట్రంలో అయినా చెల్లుతాయేమో కానీ ఏపీలో మాత్రం సాగవని చెప్పారు. విశాఖ నవ నిర్మాణ దీక్షలో మాట్లాడారు.
చదవండి: టైం వృథా చేసుకోకు, ఇలా చెయ్: పవన్కు పరిటాల సునీత ఆహ్వానం, నాటి పీఆర్పీ నేతకు జనసేన ఝలక్!
బీజేపీ, సహా విపక్షాల చెవుల్లో జనం పూవులు పెడతారన్నారు. రాజీనామాలపై వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. ఉప ఎన్నికలు రాకుండా జగన్ కేంద్రంతో అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రపై మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తనపై జగన్, పవన్ కళ్యాణ్ విమర్శలు అందులో భాగమే అన్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలని ఓడించాలన్నారు.
చదవండి: పవన్ సడన్గా యూటర్న్: సీఎం, 'చంద్రబాబును తక్కువగా అంచనా వేయొద్దు, తిప్పేయగలరు'
నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ నన్ను పొగిడారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తనను పొగిడారని, ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకొని తిడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మనం దూరమయ్యాకే ఆయన విమర్శలు సాగిస్తున్నారని చెప్పారు. మొన్న పొగిడి ఇప్పుడు తిట్టడానికి పవన్ కారణం చెప్పాలన్నారు. బీజేపీతో జగన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 11 కేసుల్లో దోషిగా ఉండి, ప్రతి శుక్రవారం కోర్టుకు తలవంచుకొని కోర్టులో హాజరయ్యే మొదటి నిందితుడు తనను అవినీతిపరుడు అని విమర్శించడమా అన్నారు.
నిమిషం ఆలోచించకుండా అశోక్ గజపతి రాజు రాజీనామా
గతంలో ఏపీకి అన్యాయం చేసినందుకే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయిందని, విభజన చట్టం ప్రకారం రావాల్సినవన్నీ ఇస్తామని, ఢిల్లీ కంటే అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పినా చేయకుండా నమ్మకద్రోహం చేశారని చంద్రబాబు అన్నారు. నాలుగో ఏడాది బడ్జెట్ చూశాక ఇక లాభం లేదని మరో మార్గం లేకే తిరుగుబావుటా ఎగురవేశానన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజుని రాజీనామా చేయమనగానే నిమిషమైనా ఆలోచించకుండా చేశారన్నారు. వైసీపీ మాత్రం ఇప్పటికీ రాజీనామాల పేరుతో డ్రామాలాడుతోందన్నారు. వైసీపీ కేంద్రంపై అవిశ్వాసం పెడితే ఒక్కరు రాలేదన్నారు. టీడీపీ పెడితే వందమంది ఎంపీలు మద్దతు పలికారన్నారు.
నేడో, రేపో ఆమోదించినా ఆశ్చర్యం లేదు
ఎన్నికలు పెట్టేందుకు సమయం మించిపోయినందున నేడో రేపో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా ఆశ్చర్యం లేదని చంద్రబాబు అన్నారు. పవన్ మహాకుట్రలో భాగంగానే విమర్శించడం మొదలుపెట్టారు. నా మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఆయన నన్ను ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదన్నారు.
నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు
తన చేతికి వాచీ లేదని, ఉంగరం లేదని, జేబులో డబ్బులు లేవని, తానెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదని, మందుకొట్టలేదని, సిగరేట్ కాల్చలేదని, చెడు స్నేహాలు చేయలేని, అలాంటి నన్ను తిడుతుంటే రాష్ట్ర ప్రజల కోసం భరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. కేంద్రం కర్ణాటకలో గాలి జనార్ధన్ రెడ్డి, రాష్ట్రంలో జగన్ వంటి అవినీతిపరులను రక్షిస్తోందన్నారు. ప్రజలు నాకు రక్షణ కవచంలా ఉండాలన్నారు.
సీఎం సభకు వర్షం అడ్డంకి
శృంగవరపుకోటలో సోమవారం చేపట్టిన నవ నిర్మాణదీక్ష సభకు భారీ వర్షం అంతరాయం కలిగించింది. మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతుండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. ఈదురుగాలులకు సభా ప్రాంగణం చిగురుటాకులా వణికింది. రెండువైపులా రేకులు ఎగిరిపోవడంతో అదెక్కడ కూలిపోతుందోనని పలువురు హడలిపోయారు. వేదికపై ఉన్న చంద్రబాబుపై కూడా వర్షం నీరు పడడంతో ఆయన కుర్చీ మారగా భద్రతా సిబ్బంది గొడుగు పట్టవలసి వచ్చింది. దాదాపు అరగంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. చంద్రబాబు తిరిగి సభను ప్రారంభించి ఏకధాటిగా 1.20 గంటల పాటు ప్రసంగించారు.