సరికొత్త ప్రణాళిక: కేసీఆర్కు భిన్నంగా, ఏపీలో చంద్రబాబు కొత్త ప్లాన్
అమరావతి: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జిల్లాలను భారీ సంఖ్యలో పెంచింది. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త ప్రయోగం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారంటున్నారు. కొత్త జిల్లాలకు బదులు పాలనపరమైన సౌలభ్యం కోసం ఏపీలో అరవై మినీ జిల్లాలుగా వికేంద్రీకరించనున్నారట.
తద్వారా పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ డివిజన్ను కేంద్రంగా చేసుకుని అన్ని ప్రభుత్వ పథకాల మంజూరు, అమలు, పర్యవేక్షణ అంతా అక్కడి నుంచే జరిగేలా చూడాలని భావిస్తున్నారు.
కొత్తగా చేపడుతున్న ఈ పాలనా సంస్కరణలతో ఇప్పటి వరకు కేవలం రెవెన్యూ వ్యవహారాలకే పరిమితమైన ఆర్డీవోల పాత్ర మరింత విస్తృతం కానుంది. కలెక్టర్లు జిల్లాలో అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా పర్యవేక్షిస్తున్నారో ఇకపై ఆర్డీవోలు రెవెన్యూ డివిజన్లో అలా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
వీలైనంతవరకూ అత్యధిక శాతం నిర్ణయాలు రెవెన్యూ డివిజన్లోనే జరిగిపోయేలా చూడాలన్నది చంద్రబాబు ఆలోచనగా భావిస్తున్నారు. అలాగే పోలీసు శాఖలో డీఎస్పీ పరిధిని ఆర్డీవో పరిధికి సమానంగా మారుస్తున్నారు. దీనివల్ల పర్యవేక్షణ సులువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
డిఎస్పీల బాధ్యతలను పెంచి, జిల్లా ఎస్పీల వద్ద ఉన్న అధికారాల్లో కొన్నింటిని వారికి అప్పగించాలని యోచిస్తున్నారు. అలాగే జిల్లా స్థాయిలో ఉండే అన్ని ప్రభుత్వ, సంక్షేమ, ఇంజనీరింగ్ శాఖల కార్యాలయాలు, వివిధ విభాగాలన్నీ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీల స్థాయి అధికారులు నాలుగేసి వందల మంది ఉన్నారు. వీరిలో సమర్థులు, మంచి పేరున్న వారిని ఆర్డీవోలు, డీఎస్పీలుగా నియమించాలని యోచిస్తున్నారని అంటున్నారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ సమీక్షలు, ముఖ్యమంత్రి సమీక్షలు కూడా రెవెన్యూ డివిజన్ స్థాయిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.