'చంద్రబాబూ! ఇదేం తీరు, తుఫాను వచ్చినప్పుడు పక్క రాష్ట్రాల్లో, రేపు వచ్చి హడావుడి'
విజయవాడ: పెథాయ్ తుఫాను వల్ల ఏపీలో అత్యధిక జిల్లాల్లో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారథి సోమవారం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి రాజకీయ క్రీడలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు.
తీరం దాటిన తుఫాను: చిగురుటాకులా వణికిన తీరప్రాంతం, పెనుగాలులు, మునిగిపోయిన రోడ్లు
ఏపీలో క్షుద్రపాలన సాగుతోందని చెప్పారు. రాజకీయాలు, ఇతర పార్టీలతో సంబంధాలు అనేవే చంద్రబాబుకు ప్రథమ ప్రాధాన్యతగా కనిపిస్తోందన్నారు. క్షుద్రపూజలు అర్ధరాత్రి పూట జరుగుతుంటాయని, చంద్రబాబు కూడా ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇచ్చేసి తుపానుపై అర్ధరాత్రి సమీక్షలు చేస్తున్నారన్నారు.
ఇంత చేశాక, వేరే రాష్ట్రాలకు వెళ్లారు
పెథాయ్ తుఫాను తీవ్రతను బట్టి ప్రభుత్వం అత్యవసర పరిస్దితిని ప్రకటించిందని, అధికారులందరికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసిందని, ఆర్టీసీ, రైల్వేల సర్వీసులు రద్దు చేశారని, స్కూళ్లకు సైతం సెలవులు ఇచ్చారని, కానీ 24గంటలు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన చంద్రబాబు మాత్రం ప్రమాణ స్వీకారాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లారని పార్థసారథి నిప్పులు చెరిగారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లడమా?
ఏపీలో తుఫాను బీభత్సం సృష్టిస్తుంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్ళడాన్ని మరో వైసీపీ నేత పార్థసారథి తప్పుబట్టారు. ఏపీ మంత్రులు కూడా హైదరాబాదులో ప్రయివేటు ఫంక్షన్లో ఉన్నారని, తుఫాను వచ్చే సమయంలో సీఎం పని చేయరని, తుఫాన్ వచ్చాక అధికారులను పని చేయనివ్వరని ఎద్దేవా చేశారు. సహాయక చర్యల సమయంలో సీఎం తన మందీమార్బలంతో అధికారుల పనులకు అఢ్డు తగులుతుంటారన్నారు.
చంద్రబాబు ఆ రాష్ట్రాల నుంచి వచ్చాక ఇలా చేస్తారు
ఇవాళ వేరే రాష్ట్రాల్లో ఉన్న చంద్రబాబు సాయంత్రం లేదా రేపు వచ్చి హడావుడి చేస్తారని పార్థసారథి నిప్పులు చెరిగారు. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ప్రచారం ప్రారంభిస్తారని అన్నారు. ఆ తర్వాత పెథాయ్ను జయించానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటారని చెప్పారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సకాలంలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, వారికి వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు.
పెథాయ్ వచ్చినప్పుడు అందుబాటులో లేరు
పెథాయ్ తుఫాను వచ్చినప్పుడు సీఎం, మంత్రులు అందుబాటులో లేరని, సొంత పనులపై వెళ్లారని పార్థసారథి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర సున్నా అన్నారు. కేవలం ముడుపుల కోసమే ఇది చేపట్టారన్నారు. తాము నీళ్లిస్తామంటూ జగన్ను ఉద్దేశించి మంత్రి దేవినేని చాలాసార్లు చెప్పారని, అవన్నీ కల్లబొల్లి మాటలుగా తేలిపోయాయన్నారు. అలా నీరు ఇవ్వలేరని తేలిపోయిందన్నారు. ఏదైనా ఒక వస్తువును ఎక్కువ ధర పెట్టి కొంటే దానిలో స్పెషాలిటి ఉంటుందని, ఏపీ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం కూడా చదరపు అడుగుకు రూ. 11, 666 వెచ్చించి కట్టారని, అందుకే వర్షం వచ్చినపుడల్లా లీకవుతుంటుందని, అదే దాని ప్రత్యేకత అని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్ట్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని అర్థమవుతోందన్నారు.