కేంద్రాన్ని అడుక్కున్నాం, తలాతోక లేని జగన్: బాబు కీలక సంకేతాలు, పవన్తో మాట్లాడుతా
హైదరాబాద్: కేంద్రంపై అవిశ్వాసం పెడతామని, తమతో కలిసి టీడీపీ వస్తుందా అని ప్రశ్నించిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం స్పందించారు. జగన్ మాటలకు తలా తోక లేదన్నారు.
Recommended Video
ఏపీకి వస్తానంటే నో చెప్పారు: మోడీకి బాబు షాక్, ఆసక్తికర అంశాలు, కారణాలివీ
పార్లమెంటులో పోరాడి ఏపీ హక్కులు సాధించుకోవాలని చెప్పారు. ఏపీ అభివృద్ధి విషయంలో ఇబ్బందులు పెట్టేవారు అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇప్పుడు కేంద్రాన్ని అడుక్కుంటున్నామని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అన్ని కేంద్రం నెరవేర్చాలని లేదంటే హోదా ఇవ్వాలన్నారు.
దగాపడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెడతా
ఇదివరకు కేంద్రాన్ని అడుక్కున్నామని, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దగాబడ్డ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టి అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని అర్థం చేసుకోవాలని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎప్పుడు విడిపోతామా ఆని జగన్ ఎదురుచూపు
కేంద్రంతో టీడీపీ పొత్తుతో ఉందని, మనం ఎప్పుడు విడిపోతామా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు. మనం బీజేపీతో విడిపోతే వైసీపీ ఆ పార్టీతో కలవాలని, కేంద్రంలో ఉండాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం పునర్విభజన చేస్తే చేయొచ్చు లేకుంటే లేదన్నారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను పూర్తి చేస్తామన్నారు.
వారిని పిలిచి మాట్లాడుతా
ఏపీకి న్యాయం కోసం చాలామంది వివిధ రకాలుగా ఉద్యమిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర హోదా ఉద్యమకారులను ఉద్దేశించి చంద్రబాబు చెప్పారు. త్వరలో వారిని పిలిచి మాట్లాడుతానని చెప్పారు. ప్రభుత్వం తరఫున కూడా ఎలా పోరాడాలో అలా పోరాడుతామని చెప్పారు. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా లేదా ఇచ్చిన హామీలు పూర్తిగా రావాలని చెప్పారు. కాగా పోరాడే వారితో కలిసి మాట్లాడుతానని చంద్రబాబు కీలక సంకేతాలు ఇవ్వడం గమనార్హం. తద్వారా అఖిలపక్షాన్ని పిలిచి మాట్లాడనున్నారు.
జగన్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం
అంతకుముందు, ఉప ముఖ్యమంత్రి బీజేపీ, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోందన్నారు. జగన్ బీజేపీని ఎప్పుడూ విమర్శించడం లేదని చెప్పారు. అవిశ్వాసం పెడతామన్నప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ మంత్రుల రాజీనామా వారి ఇష్టమని చెప్పారు. తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని, ఏపీ బీజేపీ నేతలు వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరించాలన్నారు.