మీలా మాకు షేర్ మార్కెట్ లావాదేవీలు లేవు, మీరు పని చేస్తే 36 లక్షల ఉద్యోగాలు: టీడీపీకి జీవీఎల్
అమరావతి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తమపై ఏదైనా బురద జల్లితే అది వారికి కూడా అంటుతుందనే విషయం తెలుసుకోవాలన్నారు. రాజకీయ మనుగడ కోసమే అనవసర ఆరోపణలు అన్నారు. కేంద్రంపై కుటుంబ రావు చేసిన విమర్శలపై జీవీఎల్ ఘాటుగా స్పందించారు.
ఎయిర్ఏషియా ఎఫెక్ట్, గుర్తుపెట్టుకోండి.. ప్రకంపనలు సృష్టించే స్కాం బయటపెడ్తాం: కేంద్రంపై సంచలనం
కేంద్రం నుంచి వచ్చిన నిధులతో మేం అది చేశాం.. ఇది చేశామని చెబుతున్నారని, మరి పేపర్లలో ఏం చేశారో వేయాలని సవాల్ చేశారు. రాష్ట్ర అధికారులు, కేంద్ర అధికారులు మాట్లాడుకుంటారని చెప్పడానికి ఇదేమైనా వ్యాపారమా అన్నారు. మీ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినప్పటికీ రూ.350 కోట్లు ఇవ్వాలని మేం చొరవ తీసుకొని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీకి వచ్చే ప్రతి రూపాయి వస్తుందని చెప్పారు. మాకు అధికారికంగా ఎలాంటి బాధ్యత లేకున్నా ప్రజా సంక్షేమం కోసం ముందుకు వస్తామన్నారు.
ఆయనకు షేర్ మార్కెట్లో అనుభవం
కృష్ణపట్నం విషయంలో కుటుంబ రావు తప్పుదోవ పట్టించారని జీవీఎల్ మండిపడ్డారు. కుటుంబరావును దుష్ప్రచార సంఘం అధ్యక్షుడిగా నియమిస్తే బాగుండునని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పట్ల ఆయనకు అసలు అవగాహన ఉందా అన్నారు. ఆయనకు షేర్ మార్కెట్లో చాలా అనుభవం ఉందన్నారు. షేర్ మార్కెట్ అనుభవజ్ఞుడిని ఏ రాష్ట్రంలోను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా నియమించడం చూడలేదన్నారు. రాష్ట్రంలో చేసేది వ్యాపారం కాదన్నారు. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అంటే అభివృద్ధి కోసం ఉండే వ్యక్తి అన్నారు. అసలు ఆయనకు అభివృద్ధి పట్ల అవగాహన లేదన్నారు. షేర్ మార్కెట్లో వ్యక్తిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పెట్టారని, ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని తనను పలువురు మీడియా మిత్రులు అడిగారని చెప్పారు. మీలా (టీడీపీ) షేర్ మార్కెట్ లావాదేవీలు మాకు ఉండవన్నారు. అక్రమ వ్యాపారాలు ఉండవన్నారు. మీ చిల్లర వ్యాఖ్యలను మేం పెద్దగా పట్టించుకోమన్నారు.
కృష్ణపట్నం విషయంలో ఇదీ నిజం
కృష్ణపట్నం విషయంలో తాను గతంలో చెప్పింది కనీస పరిజ్ఞానం ఉన్న వారికి ఇప్పటికే అర్థమైందని జీవీఎల్ చెప్పారు. 8 నగరాలను పారిశ్రామిక సిటీలుగా నిర్మించేందుకు కేంద్రం అప్పుడే అంగీకరించిందని, గుజరాత్లో దొలేరా తప్ప మరో నగరం లేదన్నారు. షేర్ మార్కెట్లో ఉన్న వారు అబద్దాలు చెప్పవచ్చు తప్పితే, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాట్లాడరన్నారు. కృష్ణపట్నం పనులు కావడం లేదని అందుకే నిధులు రావట్లేదన్నారు. కేవలం అబద్దాలు చెబితే నిధులు రావని, పని చేయండని, ప్రచారం మానుకోవాలని, అబద్దాలు ఆపేయాలని హితవు పలికారు. తప్పుడు పనులు చేయవద్దన్నారు. కృష్ణపట్నంకు భూమిని త్వరగా సమీకరణ చేస్తే నిధులు వస్తాయన్నారు.
ఈ రెండు ప్రాంతాల్లో 36 లక్షల ఉద్యోగాలు
విశాఖపట్నం - చెన్నై కారిడార్ను కేంద్రం తమ పరిధిలోకి తీసుకోలేదని టీడీపీ చెబుతోందని, కానీ వారే స్పందించాల్సి ఉందని జీవీఎల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అధికారుల మధ్య దీని గురించి మీటింగ్ జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని వివరాలు అడిగితే పూర్తిగా రాలేదన్నారు. దొరేరాతో అమరావతిని పోల్చడానికి వీల్లేదన్నారు. కేంద్రం అడిగిన వివరాలు ఇస్తే కేంద్రం నుంచి అన్నీ వస్తాయన్నారు. మీకు చెప్పాల్సిన మరో విషయం ఏమంటే కృష్ణపట్నంలో పూర్తిగా కారిడార్ నిర్మాణం జరిగితే 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. వైజాగ్ - చెన్నై కారిడార్ వస్తే మానుఫ్యాక్చరింగ్, ఔట్ పుట్ ఏడు రెట్లు పెరుగుతుందన్నారు. ఇక్కడ రానున్న పదిహేనేళ్లలో 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కాబట్టి రాజకీయాలు మాని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేద్దామన్నారు.
బాబుతో జాబు అని గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఏంలేదు
కలవటం ద్వారా మనం గెలుద్దామని జీవీఎల్ అన్నారు. కేంద్రం ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. బాబుతో జాబు అని మీరు గొప్పలు చెప్పుకున్నారు తప్ప చేసిందేమీ లేదన్నారు. ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు తమపై ఆరోపణలు మానుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన 7 జిల్లాలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రచారం కోసం వినియోగిస్తూ దుర్వినియోగం చేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి కాగితాల్లో తప్ప ఎక్కడా కనిపించడం లేదన్నారు.