కేంద్రం అలా చేస్తే ఇబ్బందేముంది?: బీజేపీకి దూరంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నం: విభజన హామీలను అమలు చేయకపోవడం వల్లే బీజేపీకి టీడీపీ దూరమైందని, ఆ హామీలు నెరవేరిస్తే ఇక ఇబ్బందులేముంటాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖపట్టణం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
Recommended Video
ప్రతీ రూపాయికీ లెక్క చెప్తాం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి రూపాయికీ కేంద్రానికి లెక్కలు చెప్పేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మొత్తం ఖర్చును భరిస్తామన్న కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటనను ఆయన స్వాగతించారు. గిరిజనులకు పునరావాస నిధుల్ని కేంద్రం స్వయంగా వారి ఖాతాల్లో జమ చేసినా తమకు అభ్యంతరం లేదని సీఎం తెలిపారు.
బీజేపీ దూరం కావడానికి అదే కారణం
విభజన హామీలు అమలుచేయకపోవడమే ఇరుపార్టీల మధ్య దూరానికి కారణమని చెప్పారు. విభజన హామీలు నెరవేరిస్తే ఇబ్బందులు ఏముంటాయని చంద్రబాబు ప్రశ్నించారు. అన్నీ చేస్తామని కేంద్రం చెబుతోంది కానీ.. ఎంత సమయంలో చేస్తారనేదే ముఖ్యమన్నారు. ఐదేళ్లలో కాకుండా పదేళ్లకు చేస్తే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
నూరు శాతం పారదర్శకం
పోలవరం ప్రాజెక్టులో సహాయ, పునరావాసం ఎంతో ముఖ్యమని చంద్రబాబు అన్నారు. నూరు శాతం పారదర్శకంగా నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నట్టు చెప్పారు. గోదావరి జలాలతో కర్ణాటక, తమిళనాడు సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమని సీఎం ప్రకటించారు.
గడ్కరీ మంచి నిర్ణయం..
విభజన సమస్యలను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చెప్పారు. ఆరు వరుసల రహదారుల దిశగా గడ్కరీ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. వివిధ రహదారులను అభివృద్ధి చేయాలని గడ్కరీని చంద్రబాబు కోరారు.