రిటైరైతే నాకు తిండి పెట్టేది వారే! ‘కాపు’లను కాసేది నేనే: బాబు సంచలనం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
నాకు తిండిపెట్టేది వారే..
‘సాధారణంగా రాజకీయ నాయకుల పిల్లలు సరిగా చదువుకోరు అనే భావన ఉంది. కానీ, మేం అలా భావించలేదు. ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో లోకేశ్ను స్టాన్ఫోర్డ్లో చదివించాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘మా ఇంట్లో నలుగురు ఉన్నారు. అందరూ విద్యావంతులే. నా కొడుకు, కోడలు బాగా చదువుకున్నారు. సంపాదిస్తున్నారు. నేను రిటైర్డ్ అయ్యాక వారే నాకు కొంత తిండి పెడతారు' అని చంద్రబాబు సరదాగా వ్యాఖ్యానించారు.
కాపులను కాసేది నేనే
కాపులను కాపుకాసేది తానేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం విదేశీ విద్యా పథకంలో లబ్ధిపొందిన విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కాపులకు బీసీ జాబితాలో స్థానం కల్పిస్తామని, వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా స్థానం కల్పిస్తామన్నారు.
ప్రపంచాన్ని శాసించే శక్తి మీదే..
కాపు కార్పొరేషన్కు రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించామని, కాపులను నిర్లక్ష్యం చేయబోనన్నారు. మైనార్టీలకు రూ.750 కోట్ల బడ్జెట్, ఎస్సీ సబ్ప్లాన్కు రూ.10వేల కోట్లు, ఎస్టీలకు రూ.3850 కోట్ల బడ్జెట్, బ్రాహ్మణులకు రూ.95 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు ఒక అజెండా అంటూ ఉంటుందని, తనకూ ఉందన్నారు. సమస్యలు ఒక్కరోజులో పరిష్కారం కావని, అధికారుల్లో మార్పు రావాలన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యగా చూస్తానని, ప్రపంచాన్ని శాసించే శక్తి విద్యార్థులదేనని ఆయనన్నారు.
వదిలేది లేదంటూ హెచ్చరిక
తాను విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, కుటుంబ పెద్దగా ఆలోచిస్తానని తెలిపారు. లంచగొండులను బజారున పెడతానని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అవినీతికి పాల్పడితే కబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. అంతకుముందు జ్ఞానభూమి స్మార్ట్ పోర్టల్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా నెలనెలా విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ సహయంతో సుమారు 26లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. చదువుకోవాలని ఉండీ చదువుకోలేని వారికోసం విదేశీ విద్య పథకం ఉపయోగపడుతుందన్నారు. పిల్లల భవిష్యత్ బంగారం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.