పవన్, జగన్ల విమర్శలపై స్పందించిన చంద్రబాబు
అమరావతి: ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు దిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పందించారు.
అందుబాటులోనే వైద్య సేవలు
పవన్ విమర్శలపై నేరుగా మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడక పోయినప్పటికీ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.
బాధితులు సంతృప్తిగానే..
దేశ, విదేశీ వైద్యులు, పరిశోధకులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు మందుల పంపిణీ, డయాలసిస్ చేపట్టామన్నారు. నీటి శుద్ధి, మినరల్ వాటర్ కేంద్రాల ఏర్పాటుపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సీఎం తెలిపారు.
ఆక్వా రైతులకు మద్దతంటూ
దీంతపాటు ‘రాష్ట్రంలో ఆక్వా ధరల పతనం, రైతుల సమస్యలపై అధికారులతో సమీక్షించాం. ఆక్వా ఎగుమతుల వల్ల విదేశీ వాణిజ్యం పొందే కేంద్రం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. మే 26న ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని నిర్ణయించాం' అని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు మరోసారి తప్పులో కాలేశారు: నెటిజన్లు వేసుకున్నారు!
జగన్ విమర్శల నేపథ్యంలో..
కాగా, ఆక్వా రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ మేరకు స్పందించడం గమనార్హం. ‘ చేపలు, రొయ్యలు, ఉత్పత్తి లేదని, హ్యార్చరీలు పుట్టగొడుగుల్లా వెలిసాయని, నాణ్యత లేని సీడ్స్ ఇస్తున్నారని, నాణ్యత పరీక్షించుకోవడానికి వెళ్తే ప్రభుత్వ ల్యాబ్లు మూసేశారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నియంత్రణ, నాణ్యత లేకపోవడంతో రైతులు మోసపోతున్నారు' అని జగన్ ధ్వజమెత్తారు.