రాజకీయ నిర్ణయమే, తొందరవద్దు: బడ్జెట్పై చర్చలో చంద్రబాబు ఆవేదన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయడు మరోసారి కేంద్రం వైఖరిపై ఘాటుగానే స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజకీయ నిర్ణయం తీసుకుందామని అన్నారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన ఏపీ మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తేల్చుకోవాల్సిందే, మొహమాటం వద్దు: కేంద్రంపై బాబు అసహనం, తెగదెంపులపై అయ్యన్న
ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర బడ్జెట్పైనే సుదీర్ఘంగా చర్చించారు. శాఖల వారీగా కేటాయింపుల గురించి ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర వివరించారు. అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడారు.
త్వరలో రాజకీయ నిర్ణయం
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజకీయ నిర్ణయం తీసుకుందామని, అయితే, తొందరపడి ఎవరూ ఏది పడితే అది మాట్లాడొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. జరిగిన అన్యాయంపై పోరాటం ఉంటుందని చెప్పారు.
బాబుకు తెలియందేం కాదు: అమిత్ షాతో భేటీపై పురంధేశ్వరి, కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు ఆవేదన
అమరావతిని పల్లెకాదు.. పట్నం కాదన్నట్లు చూస్తున్నారని ఆవేదన చంద్రబాబు వ్యక్తంచేశారు. అమరావతికైనా మెట్రో ఇస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని కొందరు మంత్రులు వ్యక్తంచేయగా.. విశాఖకైనా మెట్రో ఇస్తే బాగుండేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
ఏపీ మాటేది? రెండ్రోజుల్లో కీలక నిర్ణయం: బడ్జెట్పై సోమిరెడ్డి, ఆ రెండే తెలుసంటూ జగన్పై నిప్పులు
దక్షిణాదికి తక్కువ కేటాయింపులు
అంతేగాక, విశాఖ కంటే చిన్న నగరాలకు మెట్రో ఇచ్చి మనల్ని విస్మరించారని సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదికి తక్కువ కేటాయింపులు జరిగాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. అర్బన్ హౌసింగ్పై మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమావేశం అనంతరం మంత్రి నారాయణ వివరించారు. 2019 మార్చి నాటికి 5 లక్షల నాణ్యమైన ఇళ్లు అందిస్తామని తెలిపారు. మొత్తం రూ.38 వేల కోట్ల ఖర్చుతో ఇళ్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కాగా, మృతిచెందిన అగ్రిగోల్డ్ బాధితులకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అమరావతిలో 108 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆరు ఎకనామిక్ సిటీల నిర్మాణం
కాగా, అంతకుముందు మంత్రివర్గ సమావేశంలో ఏపీ కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆరు ఎకనమిక్ సిటీల నిర్మాణానికి ఆమోదం లభించింది. కృష్ణా, గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో ఈ సిటీల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. వీటి ద్వారా 1,61,983 మంది ఉద్యోగాల లభించనున్నాయి.
ఏపీ అన్యాయమే జరిగింది..
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్పై మంత్రివర్గ సమావేశంలో చర్చించామని కళా చెప్పారు. రాష్ట్రంలో రూ.16వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని తెలిపారు. కాగా, బడ్జెట్ ప్రసంగంలో రాజధాని, రైల్వేజోన్, రెవెన్యూ లోటు అంశాల ప్రస్తావనే లేదని చెప్పారు. ఫిబ్రవరి 4న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుందని.. ఆ సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తామని వెంకట్రావు తెలిపారు.