'చంద్రబాబు వన్ షాట్కు ముగ్గురు ఖతం!, ఆ నిర్ణయాలు పరిస్థితిని మార్చాయి'
అమరావతి: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న పథకాలు ఆ పార్టీకి లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు.
మరి ఇది తెలుసా: కోడెలకు విజయసాయి రెడ్డి కౌంటర్, 'అసెంబ్లీకి పదేపదే పిలవకండి'
బీజేపీతో పొత్తు కోసం ఎవరైనా వస్తారా, పవన్ను విమర్శించట్లేదు
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ... ఏపీలో బీజేపీతో పొత్తుకు ఏ పార్టీ అయినా ముందుకు వస్తుందా అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే అంశాన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెబుతానని అన్నారు. తాను ఏ పార్టీలో చేరేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ను విమర్శించిన టీడీపీ ఇప్పుడు అంతగా విమర్శించడం లేదని గుర్తు చేశారు.
చంద్రబాబు నిర్ణయాలు పరిస్థితిని మార్చాయా?
ఇటీవల చంద్రబాబు నాయుడు పింఛన్ పెంపు టీడీపీకీ మైలేజ్ ఇచ్చే అంశమేనని విష్ణు కుమార్ రాజు అన్నారు. డబ్బులు ఇచ్చినప్పుడు ప్రజల నుంచి సహజంగా సానుకూలత వస్తుందని చెప్పారు. బీజేపీపై గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీనే భారీస్థాయిలో బురద జల్లిందని వాపోయారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు సాయం కారణంగా టీడీపీకి సానుకూలత పెరిగిందని చెప్పారు. చంద్రబాబు ఈ నిర్ణయాలు తీసుకోకుంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అదే గతి
చంద్రబాబు నాయుడు దెబ్బకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలకు దెబ్బ తగిలిందని విష్ణు కుమార్ రాజు అన్నారు. టీడీపీ, కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా నష్టపోయిందని చెప్పారు. రేపు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకునే పార్టీలకు కూడా అదే గతి పడుతుందని చెప్పారు. వన్ షాట్ టు బర్డ్స్ అంటారని, కానీ చంద్రబాబు కారణంగా త్రీ బర్డ్స్ పడిపోయాయని, అది తెలంగాణలో జరిగిందని, అక్కడ టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు గెలుచుకునేదని, కానీ టీడీపీ పని ఖతమైందని, ఆ తర్వాత కాంగ్రెస్ పోయిందని, వీరి మధ్య పోరు కారణంగా అక్కడ (తెలంగాణ) బీజేపీకి పడాల్సిన ఓట్లు కూడా తెరాసకు పడ్డాయని చెప్పారు. చంద్రబాబు ఆలోచన విధానం అంత పవర్ ఫుల్ అని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీతో ఎవరు పెట్టుకుంటే వారు పోతారన్నారు.