నంద్యాల ఉప ఎన్నిక: వైసీపీ, టిడిపి వ్యూహకర్తల్లో ఎవరిది పైచేయి!
నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈ స్థానంలో విజయం సాధించేందుకు అధికార, విపక్షాలు నంద్యాలలో వ్యూహలను రచిస్తున్నాయి. ఎనిమిదిమంది మంత్రులు నంద్యాలలో మకాం వేశారు.
నంద్యాల:నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈ స్థానంలో విజయం సాధించేందుకు అధికార, విపక్షాలు నంద్యాలలో వ్యూహలను రచిస్తున్నాయి. ఎనిమిదిమంది మంత్రులు నంద్యాలలో మకాం వేశారు. మరో 12 మంది ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మనందరెడ్డి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కీలక నేతలు నంద్యాలలో పర్యటిస్తున్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో నంద్యాలలో కొత్తగా పనులు చేపట్టడానికి లేకుండాపోయింది.
ఈ ఏడాది మార్చి 12వ, తేదిన గుండెపోటుతో భూమా నాగిరెడ్డి మరణించారు. దీంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే ఈ స్థానంలో విజయం సాధించేందుకుగాను వైసీపీ, టిడిపిలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.
'తల్లిదండ్రులులేని బిడ్డలపై పోటీయా, ఎవరో చెబితే వినేవాడు నాయకుడా'?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే రెండుసార్లు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నంద్యాల పట్టణంతో పాటు ఈ సెగ్మెంట్లోని పలు మండలాల్లో కూడ ఆయన పర్యటించారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు బాబు దిశానిర్ధేశం చేశారు. ఈ స్థానం నుండి 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తోందనే ధీమాను బాబు వ్యక్తం చేశారు.ఈ మేరకు నంద్యాలలో పదవుల పందేరాన్ని నిర్వహించింది టిడిపి. కీలకమైన నేతలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టింది.
నంద్యాల ఉప ఎన్నిక అనంతపురం నేతలకు బాధ్యతలు
నంద్యాల ఉప ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అధికార, వైసీపీలో కూడ అనంతపురం జిల్లాకు చెందిన నేతలే తీసుకొన్నారు. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు అధికారపార్టీ తరపున బాధ్యతలను తీసుకొన్నారు. కాలువతో పాటు మరో 7 మంత్రులకు ఈ ఎన్నికల బాధ్యతలను కేటాయించారు.మరో 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు కూడ ఈ నియోజకవర్గంలో ఇంచార్జ్ బాధ్యతలు కేటాయించారు.వీరంతా ప్రచారం పూర్తయ్యేవరకు నియోజకవర్గంలోనే కొనసాగుతారు.మరో వైపు వైసీపీ బాధ్యతలను అనంతపురం మాజీ ఎంపి అనంతవెంకట్రామిరెడ్డి తీసుకొన్నారు.
Recommended Video
కాలువ వర్సెస్ అనంత
నంద్యాల ఉప ఎన్నికల పోరు మంత్రి కాలువ శ్రీనివాసులు, మాజీ ఎంపి అనంతవెంకట్రామిరెడ్డి మధ్య పోరుగా మారింది. రాజకీయరంగ ప్రవేశం చేసిన అనంతవెంకట్రామిరెడ్డిపై కాలువ శ్రీనివాసులు పోటీచేసి విజయం సాదించారు. అయితే ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.అనంతవెంకట్రామిరెడ్డి రాజకీయాల్లో సుదీర్ఘకాలంపాటు నుండి ఉన్నారు. అయితే కాలువ 1998 సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరి వ్యూహలు పై చేయిని సాధిస్తాయో చూడాలి. అయితే అధికారపార్టీకి ఉపఎన్నికల్లో ప్రయోజనం ఉంటుంది.
ఎన్నిక కోడ్....ఆగిన నిధుల ప్రవాహం
నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే నంద్యాలలో అధికారపార్టీ పలు అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పనులు ..ప్రాజెక్టులు అమల్లోకి రావు. ఇప్పటికే ప్రారంభించిన పనులను చేస్తూ ఉండేందుకు అనుమతులుంటాయే తప్ప , కొత్తగా పనులు చేసేందుకు వీలుండదు. నంద్యాలలో పట్టణంలో 13 వేల గృహలు, ముస్లిం షాదీఖానా , రహదారుల విస్తరణతో పాటు రూ.900 కోట్ల విలువైన పనులను చేపట్టారు.
కలెక్టర్ చేతిలోకి పాలన
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కర్నూల్ కలెక్టర్ చేతిలోకి పాలన వెళ్ళింది.ఎన్నికల కోడ్ ముగిసేవరకు ఇదే పరిస్థితి ఉంటుంది. శాంతిభ్రదతలతోపాటు, సాధారణ పాలనా పాగ్గాలు కలెక్టర్ చేతిలోకి వెళ్ళాయి.అయితే ఈ ఎన్నికను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. అయితే ఈ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించడం అధికారులకు కత్తిమీదసామే.