అఖిలప్రియ బాధ్యత: చలించిన బాబు, నా తండ్రి ప్రజలకప్పగించారు: అఖిల
దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతిక దేహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు. అఖిల ప్రియను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆళ్లగడ్డ: దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతిక దేహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం నివాళులు అర్పించారు. అఖిల ప్రియను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భూమా బౌతికకాయాన్ని చూసి చంద్రబాబు చలించిపోయారు. భూమా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. భూమాకు చంద్రబాబు నివాళి అర్పింస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు జోహార్ భూమా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నివాళి
భూమా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలియగానే ఆయనను ఎలాగైనా బతికించాలని చంద్రబాబు తపనపడ్డారు. భూమా కుటుంబానికి టీడీపీతో దశాబ్దాల అనుబంధం ఉందని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తనకు, రాజకీయంగా టీడీపీకి, కర్నూలు జిల్లాకు తీరనిలోటని, మూడేళ్ల క్రితం తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోయిన అఖిలప్రియను.. తాను తండ్రిలా కాపాడుకొంటానని చంద్రబాబు ఇప్పటికే భరోసా ఇచ్చారు.
కన్నీటి సంద్రమైన ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ కన్నీటి సంద్రమైంది. ఆయన్ను కడసారి చూసేందుకు వేలాది ప్రజలు తరలి వచ్చారు. వారు భూమా పార్థివదేహాన్ని చూసి బోరున విలపిస్తున్నారు. నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, పీతల సుజాత, యువనేత నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీ మోహన్ రెడ్డి భావోద్వేగం
దివంగత భూమా శోభానాగి రెడ్డికి సొంత సోదరుడు, ఎమ్మెల్యే మోహన్ రెడ్డి.. భూమా మృతిని తలచుకుంటూ మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడారు. అఖిలప్రియ కూడా మంచి నాయకురాలిగా ఎదిగిందని, ఆమె కార్యకర్తలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుందని, అఖిలప్రియకు తోడుగా నేనుంటానని, నాగిరెడ్డి రాజకీయంగా ఎదిగే సమయంలో ఇలా మృతిచెందడం బాధాకరమన్నారు.
శోభ మరణం, జిల్లా రాజకీయాలు కలిసి..
శోభాలేని లోటును గుర్తుచేసుకుని బాధపడేవారని, పగలు గంభీరంగా ఉన్న రాత్రి సమయాల్లో శోభాను గుర్తుచేసుకుని చాలా బాధపడేవారని, నంద్యాలను అభివృద్ధి చేయాలని ఆలోచించేవారని, శోభా మరణం, జిల్లా రాజకీయాలు ఇవన్నీ కలిసి భూమా అనారోగ్యానికి కారణమయ్యాయని ఎస్వీ మోహన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
నా వెంట ప్రజలు... అఖిల ప్రియ
తనను తన తండ్రి భూమా నాగిరెడ్డి ప్రజలకు అప్పగించి వెళ్లారని భూమా అఖిలప్రియ అన్నారు. ఆమె ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. తన వెంట ప్రజలు ఉన్నారని చెప్పారు. భూమా, శోభ ఆశయాల కోసం పని చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు.
ప్రభుత్వ లాంఛనాలతో భూమా అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో భూమా అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియలకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. శోభా ఘాట్ వద్ద భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల్లో మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.