యోగా డే: బెజవాడలో చంద్రబాబు, హైదరాబాద్లో బాలకృష్ణ ఆసనాలు వేశారు
అమరావతి: యోగాను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలోని ఎ1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యోగా ఆసనాల వల్ల ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. ఆత్మ, పరమాత్మను కలిపేదే యోగా అని పేర్కొన్నారు. యోగాకు భవిష్యత్లో మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో యోగాను ఓ కోర్సుగా ప్రవేశపెడతామని చెప్పారు.
యోగా ఎంత ముఖ్యమో.. తినే ఆహారం కూడా అంతే ముఖ్యమన్నారు. మంచి ఆహారం కోసం రాష్ట్రంలో న్యూట్రిషన్ మిషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే నాగరికతలో భారత్ ముందుందని, మన కుటుంబ వ్యవస్థ ప్రపచంలో ఎక్కడా లేదన్నారు.
కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడే నిజమైన ఆనందం ఉంటుందని పేర్కొన్నారు. ఈ యోగా కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు చిన రాజప్ప, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు.
The new train will run 6 days/week &will make travel convenient for employees commuting during the transition period pic.twitter.com/1ddn9i6VvQ
— N Chandrababu Naidu (@ncbn) June 21, 2016
Flagged off single-stop superfast train between Secunderabad & Vijayawada and non-stop between Guntur & Secunderabad, with @sureshpprabhu.
— N Chandrababu Naidu (@ncbn) June 21, 2016
రాజ్భవన్లో ఆసనాలు వేసిన గవర్నర్
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజభవన్లో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు, సిబ్బంది, ఉద్యోగులు యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ నరసింహాన్ ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు.
యోగాతో బహుప్రయోజనాలున్నాయని ఆయన చెప్పారు. యోగాతో ఒత్తిడిని అధిగమించవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనస్సు, శరీరం ఉల్లాసంగా ఉంటుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు.
కేబీఆర్ పార్క్లో ఆసనాలు వేసిన బాలకృష్ణ
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తదితరులు యోగా వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు.
సంజీవయ్య పార్కులో
నగరంలోని సంజీవయ్య పార్కులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.