ఎలా ఉన్నారు?: చంద్రబాబు-పవన్ల కుశల ప్రశ్నలు, ముఖ్యమంత్రికే మొదట ఇవ్వమని జనసేనాని
Recommended Video
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో శ్రీ వెంకటేశ్వరస్వామి దశావతారం ఆలయంలో విగ్రహప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మహాకుంభాభిషేకం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువురు నేతలు వచ్చారు.
చాన్నాళ్లకు ఒకే వేదికపై పవన్-చంద్రబాబు: 'శ్రీవారి ఆభరణాలపై.. మీ వ్యవహారం దేశమంతా చూస్తోంది'
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఐజేఎం లింగమనేని టౌన్షిప్లో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ మహాసంకల్పంతో కార్యక్రమం జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన 11 అడుగుల దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు.
మొదట పలకరించుకోలేదు
దశావతారా వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు పూజ చేశారు. దత్తపీఠాధిపతి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో ఒకేసారి పూజలు చేయించారు. అంతకుముందు చంద్రబాబుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా ఇరువురు నేతలు పక్కపక్కనే నిలబడినప్పటికీ మొదట పలకరించుకోలేదు.
లోపల ఇద్దరూ పలకరించుకున్నారు
దేవాలయానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విడివిడిగా వచ్చారు. ఆలయం వెలుపల ఉన్న టీవీ విజువల్స్లో వీరు పలకరించుకోకపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే లోపలకు వెళ్లిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. వీటికి సంబంధించిన విజువల్స్ మాత్రం కెమెరాకు చిక్కలేదని తెలుస్తోంది.
పలకరించుకున్నారని వారు చెప్పారు
చంద్రబాబు, జనసేనాని వెంట మంత్రులు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు.. పవన్ కళ్యాణ్ అనుచరులు కూడా వారితో పాటు ఉన్నారు. వీరు చెప్పిన దానిని బట్టి ఇద్దరు నేతలు లోపల పలకరించుకున్నారు.
అక్కడ మాట్లాడుకున్నారు
గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో నవధాన్యాలను ఉంచే సందర్భంగా పక్కన ఉన్న పవన్ను చూసి చంద్రబాబు నవ్వుతూ పలకరించారని, దీనికి పవన్.. ఎలా ఉన్నారని అడిగారట. చంద్రబాబును కుశల ప్రశ్నలు వేశారు. దనికి సమాధానంగా చంద్రబాబు బాగున్నానని చెప్పారు. మీరెలా ఉన్నారని అడిగారు. ఇరువురు కుశలప్రశ్నలు వేసుకున్నారు.
ముందు చంద్రబాబుకు ఇవ్వమని పవన్
ఆ తర్వాత ఇద్దరు నేతలు నవధాన్యాలను విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రాంతంలో ఉంచారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించే సమయంలో గణపతి సచ్చిదానంద స్వామికి కుడివైపు చంద్రబాబు, ఎడమవైపు పవన్ కళ్యాణ్ నిలుచున్నారు. ఎడమవైపు నుంచి తీర్థప్రసాదాలు ఇస్తున్న క్రమంలో ముందు చంద్రబాబుకు ఇవ్వాలని పవన్ కోరారు.