నేనేం టెక్కీని కాదు కానీ: 'యాపిల్' చేజారకుండా చంద్రబాబు పక్కాగా..
డల్లాస్/అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఆయన డల్లాస్లో మాట్లాడారు. గతంలో తాను ఇక్కడకు వచ్చినప్పుడు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలని కోరేవాడినని గుర్తు చేశారు.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే బలీయమైన దేశంగా ఎదుగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి భరోసాగా నిలిచిందన్నారు. భారత్ ప్రపంచ దేశాలకు అతి పెద్ద మార్కెట్గా నిలిచిందని చంద్రబాబు చెప్పారు.
ఇప్పుడు భారత దేశం గొప్ప లాజిస్టిక్ హబ్ అన్నారు. ఏపీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడమే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో పన్నెండు నుంచి 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
నేను సాంకేతిక నిపుణుడినో లేదా శాస్త్రవేత్తనో కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు కావాల్సిన సాంకేతికతను అర్థం చేసుకున్నానని చెప్పారు. అన్ని రంగాల్లో సాంకేతికతను జోడించి అగ్రస్థానంలో ఏపీని నిలబెడతామని చెప్పారు. ఏపీని నాలెడ్జ్ హబ్గా చేస్తామన్నారు.
యాపిల్ ఐ ఫోన్.. మేడిన్ ఆంధ్ర
యాపిల్ ఐఫోన్ 'మేడిన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం యాపిల్ సంస్థ ప్రధాన నిర్వహణాధికారి (చీఫ్ ఆపరేటింగ్ అధికారి) జెఫ్ విలియమ్స్తో భేటీ అయ్యారు.
ఈ భేటీలో రాష్ట్ర, యాపిల్ కంపెనీ బృందాలు ఆ సంస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్కు సంబంధించి సుదీర్ఘ మంతనాలు జరిపారని తెలస్తోంది.
ఐటీ సంస్థలతో భేటీ
రెండోరోజు పర్యటనలో ఐటీ, టెక్నాలజీ రంగాలకు చెందిన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో 12 వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించేలా మూడు సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. ఏపీలో యాపిల్ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని విలియమ్స్ను చంద్రబాబు కోరారు.
గతంలో లోకేష్, చంద్రబాబుతో చర్చలు
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రమని, వృద్ధి, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇటీవలే యాపిల్కు చెందిన ఉన్నతాధికారుల బృందం వెలగపూడిలోని సచివాలయానికి వచ్చి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్తో చర్చలు జరిపారు.
తిరుపతి విశిష్టత, స్థలంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
వాపిరి తిరుపతి, అమరావతి వద్ద స్థలాలను చూపించారు. అయితే యాపిల్ సంస్థ ఎక్కువగా తిరుపతి వద్దే ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు అమెరికా బయలుదేరే ముందు తిరుపతివద్ద యాపిల్ ఐఫోన్ యూనిట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అంశాలను, ఎక్కడ స్థలం కేటాయిస్తున్నదీ, తిరుపతి విశిష్టత గురించి తెలియజేసేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో యాపిల్ సంస్థ ప్రతినిధులను కలిశారని తెలుస్తోంది.
భూమిని సిద్ధం చేశారా?.. యాపిల్ చేజారకుండా
యాపిల్ సంస్థ కోసం ఇప్పటికే ప్రభుత్వం 150 ఎకరాలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తిరుపతి, శ్రీకాళహస్తి మధ్య ఉన్న ఏర్పేడు వద్ద ఈ భూమిని ఏపీఐఐసీ ఇప్పటికే గుర్తించిందని వార్తలు వస్తున్నాయి. యాపిల్ సంస్థ ఓకే అంటే ఆ భూమిని ఇచ్చేందుకు సిద్ధమయింది. అయితే వారు మరోసారి రాష్ట్రానికి వచ్చి చూసుకొని వెళ్లనున్నారని అంటున్నారు. కియా కార్ల కంపెనీ తరహాలో యాపిల్ ప్రతిష్ఠాత్మక సంస్థ కావడంతో ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా రాష్ట్రానికి రప్పించాలనే పట్టుదలతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఏపీలో డెల్ డాటా సెంటర్
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ డెల్ ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. చంద్రబాబు డల్లాస్లో డెల్ ప్రతినిధి శ్రీకాంత్ సత్యతో భేటీ అయ్యారు. డల్లాస్లో పర్యటిస్తున్న చంద్రబాబు మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు బెల్ హెలికాప్టర్ డైరెక్టర్ చాద్ స్పార్క్తో భేటీ అయ్యారు.