నోట్ల రద్దు, తెరపైకి రూ.200 నోటు: మోడీకి బాబు కొత్త ప్రతిపాదన, అదే దారిలో...
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.2000 నోటుకు బదులు రూ.200 నోటు తీసుకు రావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
అమరావతి: రూ.500, రూ.1000 నోట్ల రద్దును స్వాగతిస్తూనే.. రూ.2000 నోటును తీసుకు రావడాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. రూ.2000 నోటు కాకుండా రూ.200 నోటు తీసుకు రావాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు తర్వాత ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ (ఏఐఏఐ) కూడా రూ.200 నోటును తీసుకు రావాలని కోరింది. గురువారం నాడు ఆ సంఘం అధ్యక్షుడు విజయ్ కలాంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు సానుకూలంగానే స్వీకరించారని అయితే ఏటీఎం, బ్యాంకుల వద్ద క్యూ లైన్లు పెరిగిపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు. బ్యాంకులు చిన్న నోట్లను అందించేందుకు సిద్ధంగా లేవని, దీంతో సాధారణ ప్రజలు తమ రోజువారీ అవసరాల్లో కొత్త రూ.2000 నోట్లను ఉపయోగించుకునేందుకు అవస్థలు పడుతున్నారన్నారు.
ఈ నేపథ్యంలో రూ.200నోటును తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. సరైన ప్రణాళికతో నోట్లను రద్దు చేసి, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే ఉంటే ప్రస్తుత ఇబ్బందులు ఉండకపోయేవని అభిప్రాయపడ్డారు.
నాలుగు రోజుల క్రితం సీఎం చంద్రబాబు కూడా ఇదే చెప్పారు. కేంద్రం రూ.200 నోట్లను తీసుకు వచ్చే విషయమై ఆలోచించాలని చెప్పారు. రూ.2000 నోట్ల వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. అలాగే రూ.50, రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని బ్యాంకర్లకు సూచించారు.