అఖిలప్రియకు బాబు షాక్: ఏం జరిగినా సమాచారం, వారంతా టిడిపిలోకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియను చంద్రబాబునాయుడు అడిగిన ప్రశ్న ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీకి చెందిన నాయకులు,
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియను చంద్రబాబునాయుడు అడిగిన ప్రశ్న ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారనే విషయమై ఆయన చెప్పడంతో కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రులు , నేతలు ఆశ్చర్యపోయారు.పార్టీలో ఎవరేమీ చేస్తున్నారనే విషయాన్ని బాబుకు తెలిసిపోతోందని ఈ సమాచారంతో పార్టీ నాయకులకు అర్ధమైంది.
నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టిడిపి నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. వైసీపీ కూడ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.అయితే ఈ రెండు పార్టీలు కూడ ఈ స్థానానికి జరిగే ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.
రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు 2019 లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు రిహర్సల్స్ వంటివనే అభిప్రాయాన్ని కొందరు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికపై తీవ్రంగానే కసరత్తుచేస్తున్నాయి.ఈ విషయమై రెండు పార్టీలు తమ శక్తులను ధారపోస్తున్నాయి.
చంద్రబాబు అడిగిన ప్రశ్నలతో అఖిలప్రియకు షాక్
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీ ముఖ్యనాయకులతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నంద్యాలలో పార్టీ పరిస్థితిని బాబు సమీక్షించారు. మండలాలు, గ్రామాల వారీగా బాబు చర్చించారు.గోస్పాడు మండలంలోని టిడిపికి అనుకూలంగా ఉన్న ఓ గ్రామసర్పంచ్ పది రోజుల నుండి పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు. గ్రామంలో కూడ లేడని, నాయకులతో కూడ టచ్లో లేడని బాబు చెప్పారు. ఆయన ఎక్కడకు వెళ్ళాడని మంత్రి అఖిలప్రియను బాబు ప్రశ్నించారు. దీంతో మంత్రులతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న నేతలంతా బిత్తరపోయారు.
నేతల పేర్లను ప్రస్తావించిన బాబు
గోస్పాడు మండలానికి చెందిన పలువురు పార్టీ నాయకుల పేర్లను బాబు ప్రస్తావించారు. కొందరు నేతలు పార్టీ నాయకులు, మంత్రుల వద్దకు వస్తున్నారని చెప్పారు. అయితే మిగిలిన నాయకులు ఎందుకు క్రియాశీలకంగా లేరని బాబు ప్రశ్నించారు. అయిదుగురు సర్పంచ్ లు, మరికొందరు ఎంపిటీసిలు త్వరలోే పార్టీలో చేరతారని మంత్రి అఖిలప్రియ బాబుకు చెప్పారు. నంద్యాల పట్టణానికి చెందిన ఓ వార్డులో పార్టీ నాయకుడి పేరు చెప్పాడు. ఆయన ఏం చేస్తున్నాడని బాబు ప్రశ్నించారు. నంద్యాల నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు ఏం చేస్తున్నారో బాబు ప్రతి క్షణం తెలుసుకొంటున్నారని మంత్రులు ఖంగుతిన్నారు.
పార్టీపై ఎంత పట్టుందో అర్ధమైంది
పార్టీపై చంద్రబాబుకు ఎంత పట్టుందో ఈ ప్రశ్నలతో అర్ధమైందని పార్టీలో కొత్తగా వచ్చిన మంత్రి అఖిలప్రియకు అర్ధమైంది. ఎంతో ఓపిక, పట్టు ఉంటేనే ఈ విషయాలన్నీ తెలుస్తాయని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు నంద్యాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారని ఈ ప్రశ్నలతో అర్ధమైందని పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. చంద్రబాబునాయుడు కమిట్మెంట్ను చూస్తే తాము ఇంకా కష్టపడాలనే విషయం అర్ధమైందని కర్నూల్ జిల్లా నేతలు అంటున్నారు.
వెయ్యికోట్లతో నంద్యాలలో అభివృద్ది పనులు
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి కోట్లతో పనులను నిర్వహిస్తున్నారు. గృహనిర్మాణ పథకం, రోడ్ల విస్తరణతో పాటు ఇతర అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భూమా నాగిరెడ్డి 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకుగాను ఈ పనులను చేపట్టారు.ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేనాటిని ఈ పనులు పురోగతిలో ఉండేలా మంత్రి అఖిలప్రియ శ్రద్ద తీసుకొంటున్నారు. ఈ పనులు రానున్న ఉప ఎన్నికల్లో తమకు మరిన్ని ఓట్లు తెచ్చెపెట్టనున్నాయని భావిస్తున్నారు.