ఆల్పార్టీ మీటింగ్తో బాబు డ్రామాలు, ఏడు ప్రశ్నలు, పవన్ ఏం చేశాడు:జగన్
గుంటూరు: తమ పార్టీకి చెందిన ఎంపీలతో పాటు టిడిపి ఎంపీలు రాజీనామాలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు.ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు జగన్ ఏడు ప్రశ్నలు సంధించారు.కేసులు పెడతారనే భయంతోనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీకి చెందిన ఎంపీలతో రాజీనామాలు చేయించలేదని జగన్ విమర్శలు గుప్పించారు.నాలుగేళ్ళుగా పవన్ కళ్యాణ్ ఏపీకి ఏం చేశాడని ప్రశ్నించారు
గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయమై గత నాలుగేళ్ళుగా తాము చేస్తున్న పోరాటం విషయాన్ని జగన్ ప్రస్తావించారు.
ప్రత్యేక హోదా అవసరం లేదన్న చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీని కోరుకొన్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబునాయుడు జారవిడుచుకొన్నారని ఆయన విమర్శించారు.
టిడిపి ఎంపీలు రాజీనామాలతో హోదా వచ్చేది
ప్రత్యేక హోదా కోసం తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేయడం చరిత్రలో నిలిచిపోతోందని వైసీపీ చీప్ వైఎస్ జగన్ చెప్పారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి టిడిపి ఎంపీలు రాజీనామాలు సమర్పిస్తే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేదన్నారు.ప్రత్యేక హోదా ఏపీకి దక్కేదని జగన్ అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో అవినీతిపై కేంద్రం విచారణ చేస్తోందోమోననే భయంతో చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించలేదని జగన్ విమర్శించారు.ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఆయన చెప్పారు.
ప్లానింగ్ కమిషన్ను బాబు ఎందుకు ప్రశ్నించలేదు
ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ యూపీఏ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్కు లేఖలు పంపిందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ప్లానింగ్ కమిషన్ వద్ద ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఎందుకు ప్లానింగ్ కమిషన్కు బాబు ఎందుకు లేఖలు రాయలేదని జగన్ ప్రశ్నించారు. కేవలం ప్లానింగ్ కమిషన్తో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తే సరిపోయేదన్నారు.
అఖిలపక్షం పేరుతో బాబు డ్రామాలు
అఖిలపక్షం పేరుతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డ్రామాలు చేస్తున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విమర్శించారు. తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని జగన్ గుర్తు చేశారు. అఖిలపక్ష సమావేశానికి రావాలని తనకు వచ్చిన లేఖను మీడియా సమావేశంలో జగన్ చదివి విన్పించారు. ఢిల్లీలో హేమ మాలిని లాంటి ఎంపీలను మాత్రమే చంద్రబాబునాయుడు కలిశారని ఆయన చెప్పారు. బాబును ఢిల్లీలో ఎవరూ కూడ పట్టించుకోలేదని ఆయన చెప్పారు.
కేంద్రంపై బాబు అవిశ్వాసం పెట్టేవారా
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తాము కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే టిడిపి అవిశ్వాసం పెట్టేదా అని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయమై నాలుగేళ్ళుగా ఏం చేశారని ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సంఖ్యబలం ఉంటే మద్దతిస్తామని ప్రకటించిన చంద్రబాబునాయుడు గతంలో చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు.
పవన్ సినిమా తక్కువ
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళుగా ఏం చేశారో చెప్పాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రశ్నించారు. నాలుగేళ్ళుగా ఏదైనా సమస్య వచ్చిన సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మరో వైపు పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంటర్వెల్ ఎక్కువగా ఉంటుందని, సినిమా తక్కువగా ఉంటుందని జగన్ ఎద్దేవా చేశారు.ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన దానిలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడ ఉందని జగన్ విమర్శించారు. 15 రోజుల క్రితమే బాబుతో పవన్ కళ్యాణ్ తెగ దెంపులు చేసుకొన్నారని ఆయన గుర్తు చేశారు.