కేసీఆర్పై పోరాటం: రేవంత్ రెడ్డి సహా టి నేతలకు బాబు ప్రశంస
ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయ్యారు. భూ కుంభకోణంపై కేసీఆర్ ప్రభుత్వం మీద నేతల పోరును ఆయన ప్రశంసించారు.
హైదరాబాద్: ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయ్యారు. భూ కుంభకోణంపై కేసీఆర్ ప్రభుత్వం మీద నేతల పోరును ఆయన ప్రశంసించారు. మియాపూర్ భూకుంభకోణంపై టి నేతలు పోరాడుతున్న విషయం తెలిసిందే.
కేసీఆర్కు బాబు ఊహించని షాక్: ఆ ఉద్యోగులను చేర్చుకోం.. జీతాలు మీరే ఇవ్వాలి!
ఈ భేటీలో తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, నామా నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాదులో చంద్రబాబు నూతన గృహ ప్రవేశం చేసిన తర్వాత తొలిసారి నాయకులతో భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా పలు అంశాలు చర్చించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇంచార్జులు, జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై చర్చించారు. త్వరలో అమరావతిలో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. కాగా, కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను చంద్రబాబు పరామర్శించారు.
టిడిపి నేతలతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.. రామయ్య ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రామయ్య మాట్లాడారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపారు. తనకు చంద్రబాబు రూ.5లక్షల ఆర్థికసాయం ప్రకటించినట్లు వెల్లడించారు. ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్చార్జి అవుతున్నట్లు చెప్పారు.
మొక్కలు నాటి సంరక్షించడమే తన జీవిత లక్ష్యమని రామయ్య పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితం వనజీవి రామయ్య ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.