అంతా బాగుందా: దగ్గరకు వచ్చి మరీ మోడీ, బాబు దిమ్మతిరిగే జవాబు, 'ప్రధాని హామీలు నెరవేరుస్తానన్నారు'
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిన తర్వాత మోడీ - చంద్రబాబు ఎదురెదురుపడటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.
Recommended Video
సీఎం చంద్రబాబు హామీల గురించి నిలదీయడం, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ 7 నిమిషాల తర్వాత ప్రసంగం సమయం అయిపోయిందని చెప్పినా చంద్రబాబుు 20 నిమిషాల పాటు కొనసాగించడం, ఏపీ సీఎంపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించడం, బాబు-మమతా బెనర్జీ-కుమారస్వామి-పినరాయి విజయన్లు మాట్లాడుతుండగా మోడీ అక్కడకు వెళ్లి పలకరించడం.. వంటి సంఘటనలు నీతి ఆయోగ్ సందర్భంగా చోటు చేసుకున్నాయి. వారిని మోడీ పలకరించారు.
చంద్రబాబుకు ప్రశంసలు
చందబాబుని మోడీ ప్రశంసించినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ రంగంలో చంద్రబాబు కృషి అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు చాలామంది సీఎంలు మద్దతిచ్చారు. ఈ ప్రతిపాదనపై సీఎంలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఏపీకి హోదా ఇవ్వాలన్న చంద్రబాబు డిమాండ్కు సీఎంలు నితీష్ కుమార్, నారాయణస్వామి మద్దతు పలికారు. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రాలకు నిధుల కేటాయింపుపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. బాబు ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతిచ్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యవహారాన్ని చంద్రబాబు బృందం ప్రధాని దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా లంచ్ బ్రేక్లో ఈశాన్య రాష్ట్రాల సీఎంలు చంద్రబాబును కలిశారు. ఈశాన్య సీఎంలు, చంద్రబాబు నుంచి పాలనలో సూచనలు తీసుకున్నారని తెలుస్తోంది.
మోడీకి చంద్రబాబు దిమ్మతిరిగే సమాధానం
నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా మోడీ, చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అందరూ సమావేశం మందిరంలోకి వెళ్లడానికి ముందు చంద్రబాబు, మమతా బెనర్జీ, పినరాయి విజయన్, కుమారస్వామి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మోడీ వారి వద్దకు వచ్చారు. వారిని పలకరించారు. చంద్రబాబుతో కరచాలనం చేశారు. వారిద్దరూ ముక్తసరిగా మాట్లాడుకున్నారు. అంతా బాగానే ఉంది కదా అని మోడీ అడగగా.. ఏమీ బాగా లేేదు అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
నీతి అయోగ్: బాబు మాట్లాడుతుంటే అడ్డుకున్న రాజ్నాథ్, నితీష్-మమతల మద్దతు
చంద్రబాబు ట్వీట్
విభజన తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయం, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, పెద్దనోట్ల రద్దు ప్రభావం, ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రాలకు నిధుల కేటాయింపు కోసం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవద్దన్న అంశాలను కేంద్రానికి మరోసారి గట్టిగా వినిపించానని చంద్రబాబు సామాజిక అనుసంధానన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర వృద్ధి 10.5 శాతంగా ఉందని, జాతీయ వృద్ధి 8 శాతం అవసరమని, అత్యధిక రాష్ట్రాలు 10-12 శాతం వృద్ధి సాధిస్తున్నాయని ప్రస్తావించారని నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్ను ముఖ్యమంత్రి తన ట్విట్టర్లో రీట్వీట్ చేశారు.
'కేజ్రీవాల్ అంశాన్ని సాకుగా చూపి చంద్రబాబు నీతి అయోగ్ సమావేశం బహిష్కరణ'
హోదా బదులు ప్రత్యేక ఆర్థిక సాయమని తప్పుదోవ పట్టించే యత్నం
ఏపీకి హోదా ఇవ్వాలని అయిదు కోట్ల ప్రజల తరఫున డిమాండు చేస్తున్నానని, కేంద్రం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని, ఇప్పటికే ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆగ్రహంతో ఉన్న వారి మనసులను మరింత గాయపడేలా చేయొద్దని కోరుతున్నానని చంద్రబాబు నీతి అయోగ్ సమావేశంలో కోరారు. బీజేపీ మేనిఫెస్టోలో ఏపీి పదేళ్ల పాటు హోదా ఇస్తామని చెప్పిందని, ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం సాకుగా చూపిస్తూ ప్రత్యేక ఆర్థికసాయం చేస్తామంటూ కేంద్రం ప్రజలను తప్పుదోవపట్టించే యత్నం చేస్తోందని, రాష్ట్రాల అవసరాలు కేంద్రం గుర్తించాలన్నారు. ప్రధాని మోడీ కూడా ఒకప్పుడు గుజరాత్ సీఎంగా పని చేశారని, ఎక్కువ ఆదాయం వచ్చే రాజధాని అమరావతికి కావల్సినంత ఆర్థిక సాయం దక్కడం లేదని, కేంద్రం రూ.1500 కోట్లు మాత్రమే అమరావతికి ఇచ్చిందన్నారు. ఏపీకి చేయూతనివ్వాలన్నారు. నీతి అజెండాలోని ముఖ్యాంశాలు వ్యవసాయరంగం, పంటల బీమా, రైతుల ఆదాయం రెట్టింపు, ఆరోగ్యం, ఆయుష్మాన్ భవ తదితర అంశాలు.
మోడీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు
ఏపీ, బీహార్ రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా పాటిస్తామని ఈ సమావేశంలో ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తెలిపారు. సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2022 నాటికి నవభారత్ను తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని నాలుగు నుంచి ఆరు వారాల్లో ఒక పత్రాన్ని రూపొందిస్తామన్నారు. ఇప్పటికే ఒక ముసాయిదా రూపొందినా, క్షేత్రస్థాయి వాస్తవాలు కూడా ప్రతిఫలించాలనే ఉద్దేశంతో దానిని ఈసారి సమావేశంలో సమర్పించలేదన్నారు.
వాటిని మాకు వదిలేయండి
మహాత్మా గాంధీ 150వ జయంతిని ఘనంగా, కలిసికట్టుగా జరుపుకోవడానికి కేంద్రం సహకార సమాఖ్య స్ఫూర్తితో తగిన పరిస్థితులు కల్పించాలని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం వివిధ పథకాలను కేంద్రమే సూక్ష్మస్థాయి నుంచి నిర్వహిస్తోందని, వాటికి స్థూలంగా వ్యూహం రూపొందిస్తే సరిపోతుందన్నారు. పథకాలు అమలు చేసే స్వేచ్ఛను, నిధులను రాష్ట్రాలకు వదిలివేయాలన్నారు. ఓడ రేవులు, విమానాశ్రయాలు, రైలు, రహదారి అనుసంధానాలు, కోస్తా తీర ఆర్థిక మండలాలు, ఆర్థిక కారిడార్ల వంటి భారీ స్థాయి ఆర్థిక మౌలిక సదుపాయాలను అత్యంత వేగంగా నిర్ణీత కాలపరిమితిలో అమలు చేసినప్పుడే మనం దక్షిణాసియా, ఆగ్నేయాసియా వంటి దేశాలతో పోటీ పడి విదేశీ పెట్టుబడులను రాబట్టగలమని, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచుకోగలమన్నారు. ఈ ఏడాది కేంద్ర ఆర్థికమంత్రి చేసిన వాగ్దానాన్ని అమలు చేయలేదన్నారు. వ్యవసాయ అభివృద్ధిలో జాతీయ సగటు కంటే ఏపీలో చాలా ఉందని, తమకు కేంద్రం మద్దతు కూడా అవసరమన్నారు.
మోడీ ఏం చెప్పారంటే
నీతి ఆయోగ్ ముగింపులో ప్రధాని మోడీ మాట్లాడారు. రెండంకెల వృద్ధి రేటు మన ముందు సవాల్ అని, ఈ దిశగా చర్యలు చేపడదామన్నారు. రాష్ట్రాలకు ఈ ఏడాది 11 లక్షల కోట్లు ఇస్తామన్నారు. టీమ్ ఇండియాగా సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపడంలో నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సహకార స్ఫూర్తి, పోటీతో కూడిన సమాఖ్య తత్వంతో ఒకే జట్టుగా ముందడుగు వేద్దామని, జీఎస్టీ సజావుగా అమల్లోకి రావడం దీనికొక ఉదాహరణ అన్నారు. జమిలి ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుందని, వనరుల సమర్థ వినియోగానికి వీలుంటుందని, దీనిపై సమగ్ర చర్చ అవసరమన్నారు. వ్యవసాయ రంగంలో కార్పోరేట్ పెట్టుబడులు తక్కువగ ఉన్నాయన్నారు. మన ఆర్థిక రంగం అతి త్వరగా అయిదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని ప్రపంచం ఆశిస్తోందన్నారు. ఆయుష్మాన్ భవ కింద 1.5 లక్షల వెల్నెస్ కేంద్రాలను నిర్మిస్తున్నామని, వనరుల లోటు లేదన్నారు.