ఓటుకు నోటు కేసుపై చంద్రబాబు స్పందన ఇదీ...
విజయవాడ: ఓటుకు నోటు కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించడానికి నిరాకరించారు. ఆ పరిణామాలపై వచ్చిన ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాట వేశారు. మంగళవారంనాడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఓటుకు నోటు కేసుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు దానిపై తాను స్పందించడమేమిటని ఎదురు ప్రశ్న వేశారు. ఆ కేసులో ఏముందని మాట్లాడడాడనికి అంటూ ఆ పరిణామాన్ని తేలిగ్గా కొట్టేసే ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని న్యాయవాదులు చూసుకుంటారని ఆయన చెప్పారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు తెలంగాణ ఎసిబిని ఆదేశించిన విషయం తెలిసిందే. దర్యాప్తు నివేదికను సెప్టెంబర్ 29వ తేదీలోగా సర్పించాలని న్యాయమూర్తి సోమవారంనాడు ఎసిబిని ఆదేశించారు.
ఎసిబి కోర్టు ఆదేశాల నేపథ్యంలో చంద్రబాబు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. కరువు పరిస్థితులపై వివరాలను వెల్లడించడానికి చంద్రబాబు మంగళవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కోర్టు ఆదేశాల గురించి ప్రస్తావించారు. దానిపై స్పందిస్తూ - ఆ కేసులో ఏముందో మీడియానే అధ్యయనం చేసి చెప్పాలని చంద్రబాబు అన్నారు.
దాని గురించి తాను మాట్లాడమేమిటని, తమ న్యాయవాదులు చూసుకుంటారని ఆయన అన్నారు. ఎసిబి కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసే విషయాన్ని పరిశీలించాలని చంద్రబాబు న్యాయవాదులకు సూచించినట్లు తెలుస్తోంది.