హరికృష్ణ మృతిని నేటికీ నమ్మలేకపోతున్నా, మాటిస్తున్నా: బాబు, వైయస్ వర్ధంతిపై ట్వీట్
విజయవాడ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తమ తమ ట్విట్టర్ అకౌంట్ల నుంచి ట్వీట్ చేశారు.
'మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నానని, ఆయన మార్గదర్శకం తనకు ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన బావమరిది నందమూరి హరికృష్ణను మరోసారి గుర్తు చేసుకున్నారు.
'చైతన్య రథసారథి, నా ఆత్మీయుడు నందమూరి హరికృష్ణ ఇక లేరన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నేడు తన జయంతి సందర్భంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా.. టిడిపి కార్యకర్తల్లో హరి నింపిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాను.' అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా ఈ రోజు హరికృష్ణ జయంతి కూడా.