మనం కూడా జాగ్రత్తగా ఉండాలి: ఉపఎన్నికల్లో మోడీకి దెబ్బపై బాబు, ఎవరేమన్నారంటే?
న్యూఢిల్లీ/అమరావతి: దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాలలో నాలుగో లోకసభ, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ కైరానా, నూర్పూర్ వంటి కీలక స్థానాలను కోల్పోయింది. నాలుగు లోకసభ స్థానాలకు గాను బీజేపీ, మిత్రపక్షాలు రెండు గెలుచుకోగా, రెండు సిట్టింగులను బీజేపీ కోల్పోయింది. మిగతా అసెంబ్లీ స్థానాల విషయాలను పక్కన పెడితే యూపీలోని నూర్పూర్ కోల్పోవడం షాక్. బీజేపీ ఓటమిపై సొంత నేతల నుంచి విపక్షాల వరకు స్పందించారు.
కైరానాలో విపక్షాలన్ని కలిసి తబస్సుంను బరిలోకి దింపాయి. బీజేపీ వర్సెస్ విపక్షాలుగా ఇక్కడ పోటీ జరిగింది. ఇక్కడ బీజేపీకి 4 లక్షల 36వేల పైచిలుకు ఓట్లు రాగా, విపక్షాలు అన్ని కలిసి పోటీ చేస్తే 4 లక్షల 81వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. బీజేపీకి మిత్రపక్షాలు అవసరం లేదని శివసేన అధినేత ఉద్ధవ్ చెప్పగా, అహంకారం పెరిగినందునే ఓడిందని సొంత పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమిపై సుబ్రహ్మణ్య స్వామి, రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు, లోకేష్ తదితరులు స్పందించారు.
మాటలు చాలు పనిమొదలు పెట్టమన్న రీతిలో దెబ్బకొట్టారు
ఏపీ కేబినెట్ భేటీలో ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బీజేపీ వ్యవహారశైలితో ఈ ఫలితం వచ్చిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీనే మొదటిసారి మాట్లాడిందని, ఆ తర్వాతే మిగిలిన పార్టీలు మాట్లాడుతున్నాయన్నారు. దానికి మంత్రులు మాట్లాడుతూ.. బీజేపీకి వచ్చే ఎన్నికల్లోను ఇదే ఫలితం ఉంటుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. మాటలు చాలు పని మొదలు పెట్టండనే రీతిలో ప్రజలు మోడీని దెబ్బ కొట్టారన్నారు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సూచించారు. ఎక్కువ మాటలు చెప్పి, చేయకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు.
బీజేపీ నుంచి నేర్చుకున్న ఆట
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారు ఓడిపోయారని, బీజేపీకి ప్రజలు ఓటుతో మంచి సమాధానం చెప్పారని సమాజ్ వాది పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. విపక్షాలను చీల్చి గండికొట్టాలన్న బీజేపీ కుట్రలకు బ్రేక్ వేశామన్నారు. బీజేపీ ఆడుతున్న ఆటను, ఆ పార్టీ నుంచే నేర్చుకుని, తాము కూడా ఆడామన్నారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు రైతుల ప్రాణాలు తీస్తోందన్నారు.
మా మార్జిన్ అన్ని ఓట్లు రాలేదు
జేడీయు - బీజేపీలు డబ్బు వెదలజల్లాయని అయినప్పటికీ గెలవలేకపోయాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చెప్పారు. జేడీయు పైన మా ఆధిక్యత ఎంత ఉందో అన్ని ఓట్లు కూడా వారికి రాలేదన్నారు.
రెండు అడుగులు వెనక్కి వేసినా
లోకసభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. ఓ పెద్ద అడుగు వేయాలంటే రెండు అడుగులు వెనక్కు వేయాలని, భవిష్యత్తులో తాము భారీ విజయం సాధిస్తామన్నారు. విపక్షాలు అన్నీ ఏకమై బీజేపీని దెబ్బతీయాలని చూస్తున్నాయని, కానీ వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్డీయే సర్కారుపై అసంతృప్తితో ప్రజలు తిరస్కరిస్తున్నారని విపక్షాలు అంటున్నాయి.
కైరానా నుంచి గెలిచిన తబస్సుం
తాను అబద్దపు పాలనపై గెలిచానని, ఈవీఎం మిషన్లపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించవద్దని, 2019 ఎన్నికలకు ప్రతిపక్షాల ఐక్యతకు ఇది ఓ నాంది అని కైరానా నుంచి గెలిచిన తబస్సుం అన్నారు.
తబస్సుంకు అభినందనలు
ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల అండతో గెలిచిన ఆర్ఎల్డీ కైరానా అభ్యర్థి తబస్సుంకు బీజేపీ అభ్యర్థి మృగాంకా సింగ్ అభినందనలు తెలిపారు. బీజేపీకి చాలామంది ఓట్లు వేశారన్నారు. విపక్షాలు పొత్తులతో వెళ్తున్నాయని, వారికి అనుగుణంగా వచ్చే ఎన్నికలకు సమాయత్తమవుతామన్నారు.
అందుకే ఓడిపోయాం
పెట్రోల్, డీజీల్ రేట్లు పెరుగుతున్నాయని, వీటి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందుకే బీహార్లో తాము ఓడిపోయామని బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత త్యాగి అన్నారు. పెట్రోల్ ధరలపై చర్యలు తీసుకోవాలన్నారు.