కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో లక్ష మెజార్టీయా: బాబు ఆనందం! కుమారస్వామికి ఫోన్
అమరావతి: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం స్పందించారు. ఈ ఉప ఎన్నికలు బీజేపీకి శరాఘాతం అన్నారు. ఈ ఉప ఎన్నికలు బీజేపీపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు.
కర్ణాటక ఉప ఎన్నికలు: నాలుగింట కాంగ్రెస్-జేడీఎస్ గెలుపు, బీజేపీకి భారీ షాక్
ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దారుణాది దారుణంగా దెబ్బతిన్నదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై వ్యతిరేకతకు ఈ ఫలితాలే సాక్ష్యమని చెప్పారు. ప్రజలకు బీజేపీ ఎంత దూరమైందో చెప్పడానికి ఈ ఉప ఎన్నికలు చాలా స్పష్టమైన సంకేతాలు అన్నారు.
లక్ష మెజార్టీ అంటే ఎంతస్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది
కర్ణాటకలోని ఉప ఎన్నికల్లో నియోజకవర్గాల్లో బీజేపీ లక్ష మెజార్టీతో ఓడిపోయిందంటే వ్యతిరేకత ఎంతస్థాయిలో ఉందో అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలు, నేటి ఉప ఎన్నికల ఫలితాలకు ఎంతో మార్పు ఉందని చెప్పారు.
Recommended Video
రోజు రోజుకీ రాజకీయం మారిపోతోంది
రాజకీయం రోజు రోజుకీ మారిపోతోందని చంద్రబాబు అన్నారు. ఏ నాయకుడికైనా అహంభావం ఉంటే ప్రజలే వారి కళ్లు తెరిపిస్తారని చెప్పారు. అతి విశ్వాసం పతనానికి దారి తీస్తుందని చెప్పారు. సీబీఐ, ఈడీ, ఇన్కం ట్యాక్స్, ఆర్బీఐ, గవర్నర్ వంటి వ్యవస్థలను మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు.
జాతీయ నేతలను ఆహ్వానిస్తా
బీజేపీ ప్రభుత్వం ఢిల్లీని భ్రష్టు పట్టించిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ధర్మపోరాట దీక్ష ముగింపు సభ ఉంటుందని నేతలకు చెప్పారు. ఈ సభకు జాతీయ నేతలను ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు.
బాబు ఆనందం.. కుమారస్వామికి ఫోన్
కాగా, కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి గెలిచినందుకు చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు బెంగళూరుకు వెళ్లనున్నారు. జేడీఎస్ అధినేత దేవేగౌడ, సీఎం కుమారస్వామిలతో భేటీ కానున్నారు. చంద్రబాబు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.