దిక్కులేక: రాష్ట్రపతి పాలనపై బాబు ఫైర్, గంటా కితాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ప్రజాస్వామ్యానికి మచ్చ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సుస్థిర పాలన ఇవ్వలేకపోతోందన్నారు. కాంగ్రెసు పాలనలో అవినీతి, అరాచకం, విచ్చలవిడితనం పెరిగిందన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితితో బేరం కుదుర్చుకొని కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చీకొడుతుండటంతో దిక్కులేక రాష్ట్రపతి పాలన విధించారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఆలస్యమెందుకు: కిషన్ రెడ్డి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసైనప్పటికీ గెజిట్ ఎందుకు ఆలస్యమవుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. జెఏసి నేతలు ముందుకు వస్తే అమరవీరుల కుటుంబాలకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామన్నారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రెడీ చేస్తున్నామని చెప్పారు. బిజెపిపై టిడిపి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఒంటరిగానే తాము బరిలోకి దిగుతామన్నారు.
స్వాగతిస్తున్నాం: విద్యాసాగర రావు
రాష్ట్రంలో రాష్ట్రపతి పెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విద్యాసాగర రావు కరీంనగర్ జిల్లాలో అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో మేథావుల పాత్ర ఉంటుందన్నారు. అపాయింటెడ్ డేట్ పైన తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై రాష్ట్రపతి త్వరలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ముంపు గ్రామాల విలీనం ఆపాలి: ఐకాస
పోలవరం ముంపు గ్రామాలను మరికొన్నింటిని ఆర్డినెన్స్ ద్వారా సీమాంధ్రలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ముంపు గ్రామాలను కలిపే ప్రక్రియ ఆపాలన్నారు.
చంద్రబాబుకు గంటా కితాబు
చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత అని గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే శక్తి బాబుకే ఉందన్నారు. సాయంత్రం తన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత టిడిపిలో ఎప్పుడు చేరేది చెబుతానన్నారు.