ధర్నాలు చేయండి, లేఖ రాయండి: చంద్రబాబు, 'పవన్ కళ్యాణ్ సాక్ష్యాలు చూపించు'
అమరావతి: కడప ఉక్కు పరిశ్రమపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షించారు. దీని విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని చెప్పారు. రేపు (మంగళవారం) అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ధర్నాలు చేయాలన్నారు. 28న ఢిల్లీలో ఎంపీలతో ధర్నాలు చేయాలని చెప్పారు.
Recommended Video
బీజేపీ, వైసీపీ, జనసేన కుట్ర రాజకీయాలు ఎండగట్టాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అనేక లేఖలు రాశామని చెప్పారు. పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించామన్నారు. ప్రధాని, కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసినా మొండిగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంటుకు మెకాన్ కమిటీ సానుకూలంగా స్పందించిందన్నారు.
జగన్, గాలి జనార్ధన్ రెడ్డిల కోసమే తాత్సారం
మెకాన్ కమిటీ సానుకూలంగా ఉన్నప్పటికీ కేంద్రం సుప్రీం కోర్టులో వ్యతిరేకంగా అఫిడవిట్ వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్క్ఫోర్స్ సమావేశాల్లో అడిగిన వాటికల్లా మనం జవాబిచ్చామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పామన్నారు. కానీ వైసీపీ అధినేత జగన్, కర్ణాటకకు చెందిన గాలి జనార్ధన్ రెడ్డిల లబ్ధి కోసం కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు.
కేంద్రానికి లేఖ రాయండి
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖలు రాయాలని మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నుంచి అందాల్సిన సాయంతో పాటు డీపీఆర్ 2 వివరాలు లేఖలో పేర్కొనాలని సూచించారు. పోలవరంపై చేసిన రూ.1940 కోట్ల ఖర్చును విడుదల చేయాలని కూడా కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరనుంది. నిధులు పెండింగులో ఉన్నప్పటికీ తాము అన్నీ ఇచ్చేశామనే రీతిలో బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, అలా ఎలా మాట్లాడుతారని చంద్రబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్, సాక్ష్యాలు చూపించు
కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా తెలుగుదేశం పార్టీయే అఢ్డుకున్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. సోమవారం పార్టీ నేత యలమంచిలి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ రాకుండా మేం అడ్డుకున్నట్లు చెప్పిన జనసేనాని అందుకు సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు.
నీ స్థాయి దిగజార్చుకుంటున్నావ్
తన వ్యాఖ్యలతో పవన్ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. పోలవరంలో ఎంతో అవినీతి జరిగిందని చెబుతున్నారని, దమ్ముంటే బీజేపీ నేతలు చూపించాలని సవాల్ విసిరారు. అధిష్టానం మెప్పు కోసమే రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీ, జనసేన ముగ్గురూ తోడు దొంగలు అని విమర్శించారు. ఆ మూడు పార్టీల కుట్రలను ప్రజలు తిప్పికొడతారన్నారు.