ట్విట్టర్లో జగన్పై చంద్రబాబు, షర్మిల వ్యాఖ్యలపై హరి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన అజెండాను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అదే సమయంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. చాలామంది ఓటర్లు ఓ పార్టీ యొక్క అధికార దాహాన్ని అర్ధం చేసుకున్నారని, ఆ పార్టీ పెద్ద ఎత్తున విషతుల్యమైన మద్యాన్ని రాష్ట్రంలో పారిస్తోందని, దాంతో పలువురు మృతి చెందుతున్నారని ట్వీట్ చేశారు.
తాము తమ కోర్ శక్తి పైన దృష్టి సారించామని, దానిని ప్రపంచస్థాయికి తగినట్లుగా ఎలా ఉపయోగించాలనే విషయంపై ఫోకస్ చేశామని, ఆంధ్రప్రదేశ్, భారత్ అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు.
ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని మరో ట్వీట్ చేశారు. మంచి భవిష్యత్తుకు ఓటేయాలని, మంచి శ్రేయస్సుకు ఓటేయాలని, అభివృద్ధికి ఓటేయాలని, స్వర్ణాంధ్ర కోసం ఓటేయాలని, బిజెపి, టిడిపి కూటమికి ఓటేయాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దృష్టిలో అభివృద్ధి అంటే ఎన్ని అవినీతితో ఆస్తులను ఎలా పెంచుకోవాలనుకోవడమే అన్నారు. వారు ఎన్నికలలో పోటీ చేస్తోంది.. కేసుల నుండి బయటపడేందుకేనని ఆరోపించారు.
విశాఖలో హరిబాబు
తాము ఎన్డీయేకు వ్యతిరేకం కాదన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యాఖ్యల పైన బిజెపి విశాఖ అభ్యర్థి హరిబాబు స్పందించారు. వారి వ్యాఖ్యల ద్వారా బిజెపి స్పష్టమైన మెజార్టీతో విజయం సాధిస్తుందని అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ఆయన విశాఖలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్నికల తర్వాత తాను స్థానికంగా ఉంటానని, విజయమ్మ ఉండరని, అది ప్రజలకు తెలుసునని చెప్పారు.