ఫ్యాక్షన్ లీడర్లపై నిఘా ఉంచండి: బాబు హెచ్చరిక, బెజవాడ అద్దెలపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇష్టారీతిన అద్దెలు పెంచే అంశంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కంటే రెట్టింపు అద్దెలు పెంచితే వచ్చే వాళ్లు ఎలా వస్తారని ప్రశ్నించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇష్టారీతిన అద్దెలు పెంచే అంశంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కంటే రెట్టింపు అద్దెలు పెంచితే వచ్చే వాళ్లు ఎలా వస్తారని ప్రశ్నించారు.
చదవండి: ప్రభాస్కు నరేంద్ర మోడీ బంపరాఫర్
అద్దెలు నియంత్రించాలని అధికారుల్ని ఆదేశించారు. హోటల్లు కూడా ధరలు పెంచడం ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు. గతంలో కూడా చంద్రబాబు విజయవాడలో అద్దెల పెంపుపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని ప్రతిష్ట పెరిగేలా
పాఠశాలలు, కళాశాలల బస్సులను విద్యా సంవత్సరానికి ముందే తనిఖీలు చేయాలని, ర్యాగింగ్ జరగడానికి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, రాజధాని ప్రతిష్ట పెరిగేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
ఫ్యాక్షన్ లీడర్లపై నిఘా, హిస్టారికల్ డేటాతో నియంత్రణ
ఆయన కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రలపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఫ్యాక్షన్ లీడర్లపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో హిస్టారికల్ డేటా ఉపయోగించి నేరాలను నియంత్రించాలని ఆదేశించారు.
స్మగ్లర్లు నాయకులుగా మారే ప్రమాదం
స్మగ్లర్లు రాజకీయ నాయకులుగా మారే ప్రమాదం ఉందని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో కొన్ని శాంతిభద్రతల సమస్యలు ఉన్నాయని చెప్పారు. గతంలో ఫ్యాక్షనిజం సమస్యలను టిడిపి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు
ఏపీ ప్రజలు శాంతికాముకులు.. కానీ
రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీసింగ్లో ఆధునిక సాంకేతికత పైనా చర్చించారు. సహజంగానే ఏపీ ప్రజలు శాంతి కాముకులని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు రాష్ట్రంలో తక్కువని, ఏపీలో చారిత్రక నేపథ్యంలో ఫ్యాక్షన్ తరహా సమస్యలు ఉన్నాయని అన్నారు.
వార్నింగ్
నాగరిక సమాజంలో అభివృద్ధికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, రౌడీయిజం, అభద్రత ఉంటే అభివృద్ధికి విఘాతమని, ఫ్యాక్షన్ నేతలపై నిరంతర నిఘా ఉంచాలని చంద్రబాబు అన్నారు. ఎర్రచందనం, స్మగ్లింగ్, గంజాయి సాగు నివారించకపోతే నేరాలు పెరుగుతాయని, స్మగ్లర్లు రాజకీయనాయకులుగా మారుతారన్నారు.
వేగాన్ని నియంత్రించే చర్యలు
నూతన సాంకేతికతను వినియోగించుకుని నేరగాళ్లు చెలరేగిపోతారని చంద్రబాబు అన్నారు. సాంకేతికతపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని, జిల్లాల్లో జరిగే ప్రమాదాలపై జిల్లా యంత్రాంగాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధిక వేగాన్ని వెంటనే నియంత్రించాలని, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూమి విలువ బాగా పెరగడంతో భూ కబ్జాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.