'పవర్' పంచ్పై చంద్రబాబు పదేపదే: పవన్ కళ్యాణ్పై ఇదీ లెక్క!
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అక్వా ఫుడ్ పార్క్ బాధితులకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమైంది. పవన్ రంగంలోకి దిగడంతో చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఈ అంశంపై స్పందిస్తున్నారు.
శనివారం పవన్ కళ్యాణ్ను అక్వా బాధితులు కలవడంతో.. మరుసటి రోజే ఆదివారం నాడు చంద్రబాబు దీనిపై సమీక్ష నిర్వహించారు. అక్వా పరిశ్రమ నుంచి వచ్చే నీటిని నేరుగా సముద్రంలోకి వెళ్లేలా చూస్తామని వివరణ ఇచ్చారు. అభివృద్ధితో పాటు ప్రజలు కూడా ముఖ్యమని టిడిపి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తాజాగా, సోమవారం నాడు చంద్రబాబు మరోసారి ఈ అంశంపై స్పందించారు. అక్వా ఫుడ్ పార్కుతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరికీ ఇబ్బంది రాకుండా చూస్తామని, ఏకపక్షంగా టిడిపిని ఆదరించిన ఆ జిల్లాకు సమస్యలు రానివ్వమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
కలుషిత నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతామని చెప్పారు. పరిశ్రమలు, పట్టణీకరణ కూడా రాష్ట్రాభివృద్ధికి చాలా ముఖ్యమని చెప్పారు. పరిశ్రమలు వస్తే జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అక్వా ఫుడ్ పార్కులో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కాగా, పవన్ కళ్యాణ్ ఏ సమస్య పైన స్పందించినా ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రావడం చర్చనీయాంశంగా మారింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో భూసేకరణ, ప్రత్యేక హోదా.. ఇలా ఏ సమస్య పైన పవన్ మాట్లాడినా తెలుగుదేశం పార్టీ దానిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయడం గమనార్హం. పవన్ అక్వా పైన ప్రశ్నించడంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి సమీక్ష జరపడమే కాకుండా ఒకటికి రెండుసార్లు ప.గో జిల్లా ప్రజలకు హామీ ఇస్తున్నారు.
ఇదీ చంద్రబాబు లెక్క!
గత సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి అద్భుత విజయం సాధించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారు అధికారంలోకి వస్తారనే వాదన ఉంది. 2014లో మరోసారి అదే జరిగింది. నాటి ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజలు టిడిపిని అందలం ఎక్కించారు.
పైగా, పవన్ కళ్యాణ్ మద్దతు కారణంగా ఆయన సామాజిక వర్గం మూకుమ్మడిగా టిడిపికి ఓటు వేసింది. ఈ నేపథ్యంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఇటు పవన్ను, అటు వారిని దూరం చేసుకోవద్దనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఆ కారణంగానే కాస్త తగ్గి.. ఒకటికి రెండుసార్లు వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ఇటీవల ప్రత్యేక హోదా తదితర విషయాల్లో కొద్దిగా విభేదాలు పొడసూపినట్లు కనిపించాయి. ఆ తర్వాత హోదా విషయంలో పవన్.. బీజేపీని టార్గెట్ చేయడంతో ఆయన వైఖరి టిడిపికి సానుకూలంగా కనిపించింది. పవన్ వ్యాఖ్యలను చంద్రబాబు కూడా స్వాగతించారు. పవన్ మనసులో ఏమున్నప్పటికీ.. ఆయనను దూరం చేసుకునే ఉద్దేశ్యం లేదని అంటున్నారు.