ఆత్మరక్షణలో టీడీపీ, కొత్త ట్విస్ట్: బాబుపై మోడీకి కోపం ఎందుకంటే?
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని మోడీకి పాత పగ ఉందా? అంటే కావొచ్చు అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాడు గోద్రా అల్లర్ల సమయంలో చంద్రబాబు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీకి ఉద్వాసన పలకాలని డిమాండ్ చేశారని అంటున్నారు.
Recommended Video
చంద్రబాబుపై మోడీ పగతో ఉన్నారనే వ్యాఖ్యలు సరికాదని కొందరు అంటున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని, అంతేకాకుండా మోడీ వ్యక్తిత్వం అలాంటిది కాదంటున్నారు.
నాడు, నేడు చంద్రబాబు
నాడు గోద్రా అల్లర్ల సమయంలో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. చంద్రబాబు ఎన్డీయేలో ఉన్నారు. మోడీకి ఉద్వాన పలకాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికలప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా కేబినెట్ నుంచి బయటకు వచ్చారు.
చంద్రబాబు డిమాండ్, అడ్డుకున్న అద్వానీ
నాడు 28 మంది ఎంపీలతో వాజపేయి ప్రభుత్వానికి టీడీపీ మద్దతుగా ఉంది. అదే సమయంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. శాంతి భద్రతల్ని పునరుద్ధరించడంలో గుజరాత్ ప్రభుత్వం విఫలమైందని, ఈ సమయంలో సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లడం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానించింది. చంద్రబాబు డిమాండ్ చేయడంతో మోడీని తప్పించేందుకు వాజపేయి ప్రయత్నించారు. కానీ అద్వానీ వంటి నాయకులు అడ్డుకున్నారు.
అప్పటి నుంచి రగిలిపోతున్నారు
అంతేకాదు, 2003లో మోడీ గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ రావాలని ప్రయత్నించినప్పుడు కూడా చంద్రబాబు గట్టిగా అడ్డు చెప్పారు. అప్పటి నుంచే మోడీ రగిలిపోతున్నారని చెబుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, అంతేకాకుండా చంద్రబాబు కూడా ఇతరులపై ఇదే రకంగా పగతో పని చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తుందని అంటున్నారు.
ఇవేం ఊహాగానాలు
ఒకవేళ అలాంటి కోపం లేదా పగ ఉందనుకుంటే చంద్రబాబుపై తీర్చుకుంటారు కానీ ఏపీ ప్రజల పైన ఎందుకు చూపుతారని అంటున్నారు. నాటి పగ చంద్రబాబుపై ఇప్పటికీ ఉందనేది అపోహ, సిల్లీగా ఉంటుందని అంటున్నారు. ప్రత్యేక హోదా ఏపీతో పాటు బీహార్కు లేదని, ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న నిష్పత్తిలో ఏపీకి సాయం చేస్తామని చెప్పాక ఇలాంటి ఊహాగానాలకు అర్థం లేదని అంటున్నారు.
ఆత్మరక్షణలో టీడీపీ, అందుకే
ఇదిలా ఉండగా, ఏపీకి హోదా ఇవ్వలేమని, దాని బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్రం పదేపదే చెబుతోందని, కానీ జైట్లీ నిన్న ఏదో కొత్తగా చెప్పినట్లు ఇప్పుడు కేబినెట్ నుంచి బయటకు రావడం, పైగా ఎన్డీయే నుంచి బయటకు రాకపోవడంపై టీడీపీపై ఎదురు దాడి జరుగుతున్న నేపథ్యంలో కొందరు తెరపైకి పాత పగ అంటూ తీసుకొస్తున్నారని అంటున్నారు. ఓ విధంగా టీడీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో ఉందని, ఇలాంటి సమయంలో మద్దతుదారులు ఊహాగానాలు తీసుకు వస్తున్నారని అంటున్నారు.