గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నేనే మార్కెటింగ్ మేనేజర్గా ఉంటా: చంద్రబాబు
అమరావతి: ఏపీలోని అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలను కలుపుతూ గ్యాస్ పైప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో కాకినాడ-నెల్లూరు మధ్య గ్యాస్ పైపులైన్ వేయనున్నట్లు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లిక్విడ్ నాచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) టెర్మినల్ ఏర్పాటుకు ఏపీ గ్యాస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గెయిల్, ఇంజి సంస్థలు శుక్రవారం డీల్ కుదర్చుకున్నాయి. ఈ డీల్ విజయవాడలో చంద్రబాబు సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ మొత్తం ప్రాజెక్టుకు బెస్ట్ మార్కెటింగ్ మేనేజర్గా ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంలో భాగంగా కాకినాడ డీప్ వాటర్ పోర్టు వద్ద సముద్రంలో తేలియాడే టెర్మినల్ను రూ. 1,800 కోట్ల వ్యయంతో చేపట్టనున్నామన్నారు.
రోజుకు 15 మిలియన్ ఘనపు అడుగుల గ్యాస్ను ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తామన్నారు. దేశంలోని తూర్పు తీరంలో ఇదే తొలి తేలియాడే టెర్మినల్ అని పేర్కొన్నారు. దీనిని గెయిల్, ఏపీజీడీసీలు దీన్ని సంయుక్తంగా నిర్మిస్తాయని వెల్లడించారు.
ఎల్ఎన్జీ టెర్మినల్లో గెయిల్, ఏపీ ప్రభుత్వానికి 48 శాతం వాటా లభిస్తుందని, షెల్, ఇంజి, గెయిల్ లకు 52 శాతం వాటా ఉంటుందని వివరించారు. దీని నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. 19వ శతాబ్దం బొగ్గు నిల్వలకు, 20వ శతాబ్దం చమురు నిల్వల అభివృద్ధికి నిదర్శనంగా నిలిస్తే, 21వ శతాబ్దం సహజవాయువుదేనని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలోని ప్రజలందరూ పైపైల ద్వారా వంట గ్యాస్ అందుకోవాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్ హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెట్టుబడులకు ఏపీ ఎంతో అనుకూలమని, ఇటీవలే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో రాష్ట్రానికి రెండో ర్యాంకు వచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు.