సచివాలయాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా, వాళ్ల మాటలు వినొద్దని గడ్కరీకి చెప్పా: చంద్రబాబు
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం డీపీఆర్ 1లో ఇంకా రూ.400 కోట్లకు పైగా నిధులను కేంద్రం ఇవ్వాలని చెప్పారు. డీపీఆర్ 2 ఇచ్చి ఏడాది దాటినా కొర్రీలు వేస్తూ ఇప్పటికీ ఆమోదం తెలపలేదని ఆయన మండిపడ్డారు.
Recommended Video
కొన్ని అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారని చెప్పారు. కొన్ని శాఖలకు సంబంధించి సమాధానం కావాలని చెప్పారన్నారు. దానికి తాను కూడా స్పందించానని చెప్పారు. ఢిల్లీకి అధికారులను పంపుతామని, మొత్తం సమాచారం ఇస్తామని గడ్కరీకి చెప్పానని అన్నారు.
నేనే వస్తా, అవసరమైతే సచివాలయం తెస్తానని చెప్పా
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ అంశం పైన అయినా అధికారులను పంపిస్తామని, అవసరమైతే తానే ఢిల్లీకి వస్తానని గడ్కరీకి తాను స్పష్టం చేశానని చంద్రబాబు చెప్పారు. కావాలంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్నే ఢిల్లీకి తీసుకు వస్తానని కేంద్రమంత్రికి చెప్పానని అన్నారు.
భూముల విలువ పెరిగింది
ఏ సమాచారం కావాలన్నా మొత్తం ఇస్తామని గడ్కరీకి స్పష్టం చేశామని చంద్రబాబు అన్నారు. అక్కడ భూమి విలువ పెరిగిందని ఆయనకు తెలిపానని అన్నారు. ఏపీ బీజేపీ నేతలు, వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, కొన్ని శక్తులు అభివృద్ధికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని గడ్కరీకి చెప్పానని తెలిపారు.
వాళ్ల మాటలు పట్టుకోవద్దని గడ్కరీకి చెప్పా
ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావొద్దని, కొన్ని వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయని గడ్కరీకి చెప్పానని అన్నారు. ఎవరో ఆరోపణలు చేస్తే దానిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం సరికాదని కేంద్రమంత్రికి చెప్పానని అన్నారు. కొందరి మాటలు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయవద్దని చెప్పానని అన్నారు.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు
పోలవరం ప్రాజెక్టులో 56 శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని తెలిపారు. సరైన ప్రణాళిక లేకుంటే ఏపీ మరో బీహార్ అయ్యేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పటిష్ట ప్రణాళికలతో ఏపీని అభివృద్ధి బాట పట్టించామని చెప్పారు. రుణమాఫీ అమలులో ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. అన్నా క్యాంటీన్ల విరాళాల కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. మేనిఫెస్టోలోని హామీలన్నింటిని నెరవేర్చామన్నారు.