ఏ లగ్నాన పుట్టారో గానీ..పనికి మాలిన వ్యక్తి మోడీ: పులివెందులలో చెడపుట్టిన వ్యక్తి జగన్: చంద్రబాబు
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రత్యర్థులపై చేస్తోన్న విమర్శల తీవ్రతను పెంచారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా- మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. మోడీని ఆధునిక నియంత అని, ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఎంతమందిని చంపితే మోడీకి అంత ఆనందమని అన్నారు. ఏ లగ్నాన మోడీ పుట్టారో గానీ.. ఆయన తల్లిదండ్రులు ఏ భోజనం పెట్టి పెంచారో గానీ..నిజం మాట్లాడటం తెలియదని చెప్పారు.
పోలింగ్ ముంగిట్లో టీడీపీలో గ్రూపు తగాదాలు: కన్నీరు పెట్టిన మాజీ మంత్రి: తల పట్టుకుంటున్న అభ్యర్థులు
మోడీ-కోడికత్తి పార్టీ జోడీ..
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరుజిల్లాలో పర్యటించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పనికి మాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోడీయే అని చెప్పారు. మహాత్మాగాంధీ జన్మించిన గుజరాత్ లో పుట్టిన మోడీకి నిజం చెప్పడం తెలియదని అన్నారు. గాంధీదీ అహింసావాదమైతే.. మోడీది అహింసావాదని అన్నారు. ఎంతమందిని చంపితే మోడీకి అంత ఆనందమని ఆరోపించారు. మోడీ-కోడికత్తి పార్టీ జోడీని నమ్ముకుంటే రాష్ట్రాన్ని, దేశాన్ని కలిసి దోచుకుంటారని విమర్శించారు.
పులివెందులలో చెడపుట్టారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోడికత్తి పార్టీగా అభివర్ణిస్తోన్న చంద్రబాబు..వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పులివెందులలో చెడ పుట్టారని ఎద్దేవా చేశారు. పులివెందుల రైతులను జగన్ బంధువులు దోచుకుంటున్నారని విమర్శించారు. జగన్ కు లోటస్ పాండ్ లో ఏం పని అని నిలదీశారు. కేసీఆర్ తో దోస్తీ కట్టి నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎప్పుడైనా సచివాలయానికి వచ్చారా? అసెంబ్లీకి వెళ్లారా? జిల్లాల్లో తిరిగారా? అని ప్రశ్నించారు. కోడికత్తి పార్టీ వల్ల పులివెందుల అభివృద్ధి కుంటు పడుతోందని అన్నారు. మోడీ గబ్బర్ ట్యాక్స్ ను వసూలు చేస్తోంటే, జగన్మోహన్ రెడ్డి జేఎస్టీ ట్యాక్స్ పెట్టారని అన్నారు. ఇంట్లో వాళ్లనే చంపేస్తే.. ఇక మీకూ, నాకూ రక్షణ ఉంటుందా? అని వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించారు చంద్రబాబు.
కోడికత్తి పార్టీకి ఈకలు పీకడమే తెలుసు..
కోడికత్తి పార్టీకి కోడి మీద ఈకలు పీకడం మాత్రమే తెలుసని, పరిపాలన తెలియదని చంద్రబాబు విమర్శించారు. తాను ఎవ్వరూ, ఎక్కడికి వెళ్లకుండా ప్రజలందరికీ సుపరిపాలనను అందించడానికి ప్రయత్నిస్తోంటే.. గ్రామ సచివాలయం పేరుతో యువతకు ఉపాధి కల్పన మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఊరికీ పదిమందిని పెట్టి, గ్రామ పరిపాలన తీసుకొస్తానని అంటున్నారని, ఆ పదిమందిని కోడి మీద ఈకలు పీకడానికి నియమిస్తారా? అని విమర్శించారు.
ఆదాల పెళ్లి పీటల మీది నుంచి పారిపోయాడు..
ఎన్నికల సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎందుకు పార్టీ ఫిరాయించారని చంద్రబాబు నిలదీశారు. కాంట్రాక్టు పనుల కోసం కక్కుర్తి పడి, డ్రామాలు ఆడారని విమర్శించారు. ఆయారాం, గయారాం తరహాలో రాజకీయ నాయకులు తయారయ్యారని చెప్పారు. పార్టీలు ఫిరాయించే వారిది పనికి మాలిన జీవితం అని వ్యాఖ్యానించారు. జగన్ అంత పెద్ద నాయకుడైతే.. తన వద్దకు ఎందుకు వచ్చావని ఆదాలను ఉద్దేశించి ప్రశ్నించారు. కోడి కత్తి పార్టీ అంత పవర్ ఫుల్ గా కనిపించిందా? అని చురకలు అంటించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి పెళ్లి పీటల మీది నుంచి పారిపోయాడని మండిపడ్డారు.
ఓయమ్మా! వీళ్లను చూస్తే భయమేస్తోంది..
కోడికత్తి పార్టీ వాళ్లంతా రౌడీలుగా తయారయ్యారని, వారిని చూస్తోంటే భయమేస్తోందని చంద్రబాబు చెప్పారు. తన వద్ద అలాంటి ఆటలు సాగవని అన్నారు. చావడం ఉండదని, చంపడమూ ఉండదని, జైలుకు వెళ్లడం మాత్రమే ఉంటుందని హెచ్చరించారు. నేరస్తులకు ఏపీ అడ్డా కాదని అన్నారు. నేరస్తులు జైలులో శాశ్వతంగా ఉండేలా చేస్తానని, చివరికి వారిని రాష్ట్రంలోనే లేకుండా చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేస్తామని అన్నారు. తనకు, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే సమస్య ఉందని, దాన్ని ప్రజలే తీర్చేయాలని చెప్పారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ 140 నదులను అనుసంధానం చేస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇచ్ఛాపురం-తడ మధ్య బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తానని, గంటలో వెళ్లి రావచ్చని చంద్రబాబు అన్నారు.