ముస్లింలారా! మోడీ మళ్లీ గెలిస్తే మీరు ఈ దేశంలో బతకలేరు: చంద్రబాబు: అక్కడ జగన్ ట్యాక్స్
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచార తీవ్రత పెంచారు. ప్రధాని నరేంద్రమోడీ-తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై విమర్శల తాకిడిని తీవ్రతరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. చంద్రబాబు సోమవారం కడప జిల్లాలోని పులివెందులకు వెళ్లారు. వైఎస్ జగన్ సొంత గడ్డపై అడుగు పెట్టారు. ఈ ముగ్గురు నేతలపైనా ఆరోపణలు గుప్పించారు. నరేంద్రమోడీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ముస్లింలు ఈ దేశంలో బతకలేరని చంద్రబాబు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
బాబు కాదు..భళ్లాలదేవుడు: పోలవరం నుంచి డబ్బులు పిండుకుంటున్న టీడీపీ: మోడీ
జీఎస్టీ తరహాలో జేఎస్టీని వసూలు చేస్తున్నారు..
పులివెందులలో రోడ్ షో నిర్వహించిన అనంతరం వాహనం పైనుంచే ప్రసంగించారు. పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి, కడప లోక్ సభ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ నేత బీటెక్ రవి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. జీఎస్టీ తరహాలో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ (జేఎస్టీ)ని వసూలు చేస్తున్నారని విమర్శించారు. తాను మరోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే, ఇలాంటి ట్యాక్సుల నుంచి పులివెందుల ప్రజలకు విముక్తి కలిగిస్తానని అన్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ పులివెందుల ప్రజలు చెల్లిస్తున్నారని సూట్ విధానం కింద 20 శాతం కొట్టేస్తున్నారని విమర్శించారు. పేద రైతుల పొట్ట కొట్టడానికి జేఎస్టీ ట్యాక్స్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఆటలు సాగనివ్వబోనని హెచ్చరించారు.
తమ్ముళ్లూ! కడప పౌరుషం లేదా?
తాను మరోసారి అధికారంలోకి వస్తే.. హైదరాబాద్ వంటి 20 నగరాలను సృష్టిస్తానని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, సైబరాబాద్ లను తానే కట్టానని చెప్పారు. అలాంటి అనుభవం తనకు ఉందని చెప్పుకొచ్చారు. తాను అభివృద్ధి చేసి హైదరాబాద్ లో ఉంటూ, సీమాంధ్రులను కుక్కలతో పోల్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ దోస్తీ కట్టారని ఆరోపించారు. జగన్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని, కేసీఆర్, మోడీ లతో జగన్ దోస్తీ కుమ్మక్కు అయ్యారని చెప్పారు. జగన్ కు ఓటు వేస్తే.. కేసీఆర్ కు అధికారాన్ని ఇచ్చినట్టవుతుందని చంద్రబాబు అన్నారు. సీమాంధ్ర ప్రజలను దారుణంగా తిట్టిన కేసీఆర్ కు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. కడప పౌరుషం లేదా తమ్ముళ్లూ అని చంద్రబాబు పిలుపిచ్చారు. జగన్ కు ఓటు వేస్తే, మోడీ-కేసీఆర్ లకు వేసినట్టేనని అన్నారు. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే.. ఈ దేశంలో ముస్లింలు ఎవరూ బతకరని, ఈ విషయాన్ని మైనారిటీ సోదరులు గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించారు.
పులివెందులను ఆర్థిక హబ్ గా తయారు చేస్తా
మరోసారి తాను అధికారంలోకి వస్తే పులివెందులను ఫైనాన్షియల్ హబ్ గా తయారు చేస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పులివెందుల పరిధిలో పండించిన పండ్లకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తానని అన్నారు. శీతల గిడ్డంగులు విస్తారంగా నిర్మిస్తామని చెప్పారు. దళారీ వ్యవస్థను రూపుమాపుతానని అన్నారు. రైతుల ఆధ్వర్యలోనే పనిచేసే సరికొత్త మార్కెటింగ్ వ్యవస్థను సృష్టిస్తానని అన్నారు. రైతులు కష్టపడి పంటను పండించుకుంటే.. జగన్మోహన్ రెడ్డి వారి కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ విధానాన్ని అరికడతానని, రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి రానివ్వబోనని అన్నారు.
పగలు ఏపీలో..రాత్రి హైదరాబాద్ లో..
జగన్మోహన్ రెడ్డి పగలంతా ఏపీలో ఉంటారని, దోపిడీ చేయడానికి మార్గాలను వెతుక్కుంటారని చంద్రబాబు ఆరోపించారు. సాయంత్రం కాగానే.. హైదరాబాద్ వెళ్లి, లోటస్ పాండ్ లో నిద్రపోతారని అన్నారు. కొద్దిరోజలుగా ఆయన ఇదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డకు తాను వచ్చి, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటుంటే, ఆయన హైదరాబాద్ కు వెళ్లిపోయారని అన్నారు. జగన్ కు దోచుకోవడం ఒక్కటే తెలుసని చెప్పారు. 40 సంవత్సరాలుగా జగన్ కుటుంబానికి ఓటు వేస్తున్నారని, ఈ సారి సతీష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సతీష్ రెడ్డి 20 ఏళ్లుగా పోటీ చేస్తున్నారని, పులివెందుల బాగు కోసం ఉద్యమం చేశారని చంద్రబాబు చెప్పారు. ఒక్కరోజు కూడా పులివెందులకు నీళ్లు కావాలని జగన్ అడగలేదని చెప్పారు. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇచ్చామని అన్నారు.
రాయలసీమను రతనాల సీమగా మారుస్తా..
1200 కోట్ల రూపాయల ఖర్చుతో పులివెందులకు నీళ్లు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేసి, పట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లాకు నీటిని తీసుకొచ్చామని అన్నారు. శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లిస్తున్నామని చెప్పారు. మరో దఫా నదుల అనుసంధానం పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. వంశధార, నాగావళి నదులను కూడా అనుసంధానిస్తానని అన్నారు. వంశధార, నాగావళి ద్వారా రాయలసీమను నీటిని ఇస్తానని, ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత తనదేనని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.