అది చివరి అస్త్రం: పవన్ కళ్యాణ్-జగన్లకు చంద్రబాబు, రాజీనామా అంటే ఎలా
అమరావతి: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ, వైసీపీ, జనసేనానిల మధ్య మాటల యుద్ధానికి, సవాళ్లకు, ప్రతి సవాళ్లకు దారి తీసింది. వైసీపీ అధినేత జగన్కు దమ్ముంటే కేంద్రానికి ఎదురు తిరగాలని, అవిశ్వాసం పెడితే తాను అండగా ఉంటానని చెప్పారు.
జగన్! సవాల్ చేశావుగా, నీకు నేనున్నా, అవిశ్వాసం పెట్టు: పవన్ కళ్యాణ్, ఇరకాటంలో వైసీపీ
వైసీపీ అవిశ్వాసం పెడితే టీడీపీ వైఖరి కూడా తేలిపోతుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అవిశ్వాసం చివరి అస్త్రంగా మాత్రమే ఉండాలని చెప్పారు. అన్ని ప్రయత్నాలు విఫలమైతే దానికి తాము సిద్ధమన్నారు. టీడీపీకి పదవులు, అధికారం ముఖ్యం కాదని, అవి కొత్త కాదన్నారు.
అవిశ్వాసంతో ఉపయోగం లేదు
పవన్ కళ్యాణ్ చెబుతున్న, జగన్, జనసేనానిల మధ్య సవాళ్లకు కారణమైన అవిశ్వాసంతో ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అది చివరి ప్రయత్నంగా మాత్రమే ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాడు న్యాయం చేసినా, బీజేపీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేసినా ఇన్ని కష్టాలు ఉండేవి కావని చెప్పారు.
అవసరమైతే అవిశ్వాసం
రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడున్నరేళ్లుగా ఎదురు చూశామని చంద్రబాబు చెప్పారు. అన్ని ప్రయత్నాల తర్వాత అవసరమైతే అవిశ్వాసం పెడతామని చెప్పారు. అవిశ్వాసం కోసం 54 మంది ఎంపీల మద్దతు అవసరమని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందంటే దేనికైనా సిద్ధమని చెప్పారు.
రాజీనామాలు చేస్తే ఎలా పోరాడుతాం
ఎంపీలు రాజీనామా చేయాలని చెబుతున్నారని, అలా చేస్తే పార్లమెంటులో మనకు ఇచ్చిన హామీలపై ఎలా పోరాడుతామని చంద్రబాబు ప్రశ్నించారు. తాము రాజీనామా చేస్తామని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని జగన్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తే సభలో ఎలా పోరాడుతామని బాబు ప్రశ్నించారు.
బీజేపీ కూడా చెప్పింది
విభజన నేపథ్యంలో ఏపీ చాలా నష్టపోయిందని, ఈ విషయాన్ని కేంద్రానికి చెప్పానని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని తాను కేంద్రాన్ని కోరానని, బీజేపీ కూడా ఏపీకి న్యాయం చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు. వైసీపీ హామీలపై కేంద్రాన్ని అడగడం లేదని, కానీ తమపై ఆరోపణలు ఎందుకని ప్రశ్నించారు.