చంద్రబాబు మీడియా: హోదా కంటే ప్యాకేజీయే ముద్దు అనే వరకూ వదలరేమో?
అమరావతి: ఏపీకి హోదా కంటే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీయే బెటర్ అని ప్రజల్లోకి బలంగా తీసుకేళ్లేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారా? అవుననే సమాధానం వస్తోంది. ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తొలి రోజు చంద్రబాబు స్పందించిన తీరు.. ఆ తర్వాత రోజుల్లో ప్యాకేజీపై మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఏదైనా విజయం సాధించారంటే ఆ విజయానికి తానే కారణం అంటూ ఆ సక్సెస్ క్రెడిట్ని కొట్టేయడం కోసం చంద్రబాబు మీడియాను చక్కగా వాడుకుంటారు. మీడియా మేనేజ్మెంట్ ఒక్కటి తెలిస్తే చాలు అధికారంలోకి రావడం, అదే విధంగా అధికారంలో ఉన్న వాళ్లను దించేయొచ్చు అని దేశానికి పాఠలు చెప్పిన నేత ఎవరంటే చంద్రబాబే.
మీడియాను వాడుకోవడం, ప్రచారం చేసుకోవడం, చేయించుకోవడం లాంటి వాటిల్లో చంద్రబాబును మించినోడు లేడని తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పండితులు విశ్లేషిస్తుంటారు. తాజాగా కేంద్రం ఏపీకి ప్రకటించిన ప్యాకేజీ విషయంలో చంద్రబాబు పబ్లిసిటీ టెక్నిక్స్ను వాడుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు హోదా కంటే ప్యాకేజీయే బెటర్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదా వద్దు. ప్యాకేజీనే ముద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పేవరకూ చంద్రబాబు వదిలేలా లేరు. ఏపీ ప్రజలెవ్వరూ ప్రత్యేక హోదాను కోరుకోవడం లేదని, ఒకవేళ కొంత మంది ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నా వాళ్ళకు హోదా గురించి ఏమీ తెలియదని చంద్రబాబు అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హోదా కంటే ప్యాకేజీయే బెటర్ అని తెలిసేలా చేసేందుకు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. హోదాపై పవన్ కళ్యాణ్ కాకినాడలో బహిరంగ సభలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా కేంద్రం నాటకాన్ని ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడేందుకు గాను వెంకయ్య నాయుడుకి సన్మానాల పేరిట డ్రామాకు తెర లేపారు.
ఈ సన్మాన సభల్లో వెంకయ్య కూడా ఏపీకి హోదా రాదని, హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తున్నామని చెబుతున్నారు. అదేవిధంగా ప్యాకేజీ వల్ల కలిగే లాభాల గురించి ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక హోదాను తక్కువ చేయడానికి, ప్యాకేజ్ గొప్పదనం గురించి చెప్పడానికి ప్రతి రోజూ కష్టపడుతూనే ఉన్నారు.
అలాగే ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటాలను అణచివేయడానికి చంద్రబాబు తన శక్తులన్నింటినీ వాడుతున్నారు. అదే విధంగా త్వరలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కేంద్ర మంత్రులతో భారీ బహిరంగ సభలకు ప్రణాళికలను రచిస్తున్నారు. ఈ మూడు సభల్లో ఏపీకి ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర మంత్రులకు సన్మానం చేయడంతో పాటు, ప్యాకేజీ గొప్పదనాన్ని చెబుతారన్నమాట.
దీనిని బట్టి ఏపీకి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీనే ముద్దు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముక్తకంఠంతో ఒప్పుకునేవరకూ వదిలిపెట్టరన్నమాట. అయితే హోదా కోసం పవన్ కళ్యాణ్ ఉద్యమిస్తే ఈ అంశం మళ్లీ తెరపైకి వస్తుందే తప్ప అప్పటి వరకు హోదా కంటే ప్యాకేజీ ముద్దు అనే ప్రచారం సాగుతుందన్నమాట.
ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయాయి కాబట్టి గొప్ప ప్యాకేజీని ప్రకటించినందుకు 2019లో కూడా ఏపీ ప్రజలందరూ మరో సారి అధికారంలో ఉన్నవాళ్ళకు ఓటేసేలా చేయడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిని బట్టి చూస్తుంటే తెలంగాణను ఏర్పాటు చేసి ఏపీలో ప్రచారం చేసుకోవడం చేతకాక సోనియా గాంధీ ప్రజల దృష్టిలో విలన్ అయి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా కోల్పోయింది.
అదే చంద్రబాబు, మోడీలు కలిసి ఉన్న ఎన్టీఏ ప్రభుత్వం కనుక ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఆ విభజన వల్ల తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువ ప్రయోజనాలున్నాయని ఏపీ ప్రజలను ఒప్పించి ఉండేవాళ్ళనడంలో ఎటువంటి సందేహం లేదని అనిపిస్తోంది.