ఎన్నికలు జరిగితే అన్ని సీట్లు మావే: జేసీ దెబ్బతో బాబు కీలక నిర్ణయాలు, పవన్ కళ్యాణ్పై ఆగ్రహం
అమరావతి: ఎన్నికలు జరిగితే అన్ని సీట్లు మనవేనని ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం మహానాడు కమిటీలతో భేటీ సందర్భంగా అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు డ్రామాలు అని, వారు తమ రాజీనామాలను ఆమోదించుకుంటే ఎన్నికలు వచ్చేవని, అప్పుడు మనం గెలిచేవాళ్లమని చెప్పారు.
Recommended Video
వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్రం ఆడించినట్లు ఆడుతున్నారని విమర్శించారు. మహానాడు సందర్భంగా మూడు రోజుల పాటు కార్యకర్తల సేవలు మరువలేనివన్నారు. విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీలను చంద్రబాబు అభినందించారు. మహానాడుకు హాజరైన పార్టీ శ్రేణుల్లో ఇనుమడించిన ఉత్సాహం కనిపించిందన్నారు. ఇదే ఉత్సాహం ఉంటే 2019 ఎన్నికల్లో మనం తేలిగ్గా గెలుస్తామన్నారు.
కీలుబొమ్మలతో దక్షిణాదిన పాగాకు ప్రయత్నం
దక్షిణాదిన దొడ్డదారిలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తమ కీలు బొమ్మలతో దక్షిణాదిన పాగా వేయాలని చూస్తోందని పవన్ కళ్యాణ్, వైయస్ జగన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణాదిన బీజేపీ ఆటలు సాగవన్నారు.
బాబు ఎన్డీయే నుంచి బయటకు రావడానికి కారణం ఇదీ: కేంద్రమంత్రి దిమ్మతిరిగే షాక్! హోదాపై..
చంద్రబాబు కీలక నిర్ణయం
అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మహానాడు వేదికగా చేసిన సూచనలను చంద్రబాబు స్వీకరించారు. ఆ మేరకు మరుసటి రోజే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మంత్రులు, కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్సుల పైన పాక్షిక ఉపశమనం లభించిందని తెలుస్తోంది. నిత్యం టెలి కాన్ఫరెన్సులు వద్దని జేసీ సూచించారు. అలాగే జన్మభూమి కమిటీలపై ఫిర్యాదుల నేపథ్యంలోను కీలక నిర్ణయం తీసుకున్నారు.
జేసీ మహానాడు
అర్హులైన పేదలకు పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతుందని, అవి తమకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని జేసీ మహానాడులో చెప్పారు. దీంతో జన్మభూమి కమిటీల అనుమతితో సంబంధం లేకుండా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా జరిగే గ్రామ సభల్లో నూతనంగా ఎంపిక చేసిన వారికి పింఛన్ మంజూరు లేఖలు ఇస్తారు. ప్రస్తుతం ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలు అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పింఛన్లు ఇస్తున్నా జన్మభూమి కమిటీలకు అప్పగించడం వల్ల ఫలితం లేకుండా పోతుందని ఫిర్యాదులు అందాయి.
చంద్రబాబుకు సన్మానం
రజక, వడ్డెర, మత్స్యకార, కుమ్మర శాలివాహన సామాజిక వర్గాల నేతలు బుధవారం చంద్రబాబును ఘనంగా సత్కరించారు. రజకులు, మత్స్యకారులను ఎస్సీల్లో, వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన నేపథ్యంలో సచివాలయంలో ఆయననుకలిసి కృతజ్ఞతలు తెలిపారు.