అవసరం లేదు, ఈయనిలా జగన్ అలా: పవన్ కళ్యాణ్కు చంద్రబాబు, ఏపీపై ఎల్జీ ఆసక్తి
విజయవాడ: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అడిగిన లెక్కలు చెప్పాలని, ఈ ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం కౌంటర్ ఇచ్చారు. శ్వేతపత్రం ఎందుకు అని ప్రశ్నించారు. అది అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్
అలాగే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లవలసిన అవసరం లేదని చెప్పారు. అఖిలపక్షం చేయాల్సిన దాని కంటే కేంద్రం చేయాల్సింది ఎంతో ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు అందరం కలిసి వెళ్తామని, అది వేరే విషయమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. పోలవరాన్ని వైసీపీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఏపీలో ఊపందుకుంది
చంద్రబాబు నాయుడు తన దక్షిణ కొరియా పర్యటన గురించి మీడియాకు వెల్లడించారు. ఆయన బుధవారం రాత్రి విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఏపీ ఆటోమొబైల్ హబ్గా మారుతుందని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఏపీలో ఆటోమొబైల్ రంగం ఊపు అందుకుందని చెప్పారు.
Recommended Video
కొరియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్
కియో మోటార్స్కు చెందిన అనుబంధ సంస్థల రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయని చంద్రబాబు చెప్పారు. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో ఏపీఈడీబీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకుందని, దీనివల్ల రూ.3వేల కోట్ల పెట్టుబడులు, రూ.7,171ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఏపీలో కొరియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుందన్నారు.
ఏపీ వైపు ఎల్జీ చూపు
బూసన్లో జరిగిన బిజినెస్ సెమినార్లో మేకిన్ ఇండియా కొరియా సెంటర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని చంద్రబాబు చెప్పారు. ఎంవోయూలో భాగంగా బూసన్లో ఏపీ సెంటర్ను నెలకొల్పుతామని, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్జీ సంస్థ ఆసక్తి చూపిస్తోందన్నారు. మొత్తంగా రాష్ట్రానికి రూ.5వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.
ఏపీని రెండో రాజధానిగా చేసుకోవాలని కోరా
దక్షిణ కొరియా అభివృద్ధిలో దూసుకుపోతోందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు దక్షిణ కొరియా మనకంటే పేద దేశమన్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధిలో తిరుగులేని దేశంగా ఎదిగిందన్నారు. అనేక దిగ్గజ సంస్థలకు కేంద్రంగా మారిందన్నారు. ఆ దేశానికి, ఏపీకి అనేక సామీప్యతలున్నాయని చెప్పారు. ఈ పర్యటనలో వాటిని వివరించి ఏపీని రెండో రాజధానిగా చేసుకోవాలని అక్కడి పారిశ్రామికవేత్తలను కోరినట్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్ పూర్తి చేయమంటే, జగన్ అడ్డుకుంటున్నారు
పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. పోలవరంపై రాజీ పడే ప్రసక్తి లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పనులు చేస్తున్నామని తెలిపారు. ఎలా చేస్తే పనులు సకాలంలో పూర్తవుతాయో దానిపై సమీక్షిస్తున్నామన్నారు. వైసీపీ సహా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదన్నారు. పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుంటే, వైసీపీ అడ్డుకుంటోందన్నారు. పోలవరం ఖర్చు రెండింతలు పెరిగితే, పునరావాస ప్యాకేజీ పదింతలు పెరిగిందన్నారు.