సోనియాతో ఏమైనా వ్యక్తిగత విభేదాలున్నాయా, మోడీయే ఎక్కువ మోసం: బాబు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం (2 జూన్ 2018) నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో పరిణామాలపై ఈ దీక్ష సందర్భంగా చర్చిస్తామన్నారు.
మనం కూడా జాగ్రత్తగా ఉండాలి: ఉపఎన్నికల్లో మోడీకి దెబ్బపై బాబు, ఎవరేమన్నారంటే?
Recommended Video
ఈ నాలుగేళ్లలో నవ్యాంధ్రకు కేంద్రం ఏమాత్రం సహకరించలేదన్నారు. కట్టుబట్టలతో, అప్పులతో అమరావతికి తరలి వచ్చామన్నారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదన్నారు. రాష్ట్రాన్ని పూర్తి గాడిలో పెట్టేందుకు మరో ఆరేళ్లు పడుతుందన్నారు. మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చెప్పారు.
రాష్ట్రం గాడిన పడేందుకు మరో ఆరేళ్లు
తాము కేంద్రంపై పోరాడుతూనే అభివృద్ధి సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి ఆగదన్నారు. విభజన తర్వాత సరైన పాలన అందించకుంటే ఏపీ మరో బీహార్లా తయారయ్యేదన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కుదుటపడుతోందన్నారు. రాష్ట్రం పూర్తిగా గాడిన పడాలంటే మరో ఆరేళ్లు పడుతుందన్నారు. మోడీ ఇచ్చిన నినాదాలు అలాగే మిగిలిపోయాయన్నారు.
విభజన హామీలపై న్యాయపోరాటం చివరి ఆయుధం
నోట్ల రద్దు అన్నారని, అసలు డబ్బులే లేకుండా పోయాయని కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకం అని చెప్పారని, నిన్న గాక మొన్న కర్ణాటకలో ఏం జరిగిందో అందరం చూశామన్నారు. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హక్కుల విషయమై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావడం ఖాయం
జాతీయ రాజకీయాల పైన తాను అందరి మాదిరిగా కుప్పిగంతులు వేయనని చంద్రబాబు చెప్పారు. జాతీయ రాజకీయాల్లో పరిస్థితులు, పరిమితులు తనకు తెలుసునని చెప్పారు. ఏప్రాంతీయ పార్టీలు బలోపేతం కావడం ఖాయమన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. దేశ శ్రేయస్సు కోసం అన్ని పార్టీలు కలిసి పని చేయాలన్నారు. జాతీయ రాజకీయాలపై పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు.
సోనియా గాంధీతో మాకు వ్యక్తిగత తగాదాలున్నాయా?
ప్రధాని నరేంద్ర మోడీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో మాకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై టీడీపీ ఏర్పడిందని పదేపదే చెప్పే టీడీపీ ఇప్పుడు హఠాత్తుగా సోనియాతో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా అని చెప్పడం గమనార్హం. చంద్రబాబు మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీనే ఎక్కువ అన్యాయం చేస్తోందన్నారు.
రాజీనామాలు ఆమోదించకపోవడం కుట్ర కాదా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్వచ్చంధంగా రాజీనామా చేసినా ఎందుకు రాజీనామా ఆమోదించరని చంద్రబాబు ప్రశ్నించారు. స్వయంగా వెళ్లి రాజీనామాలు ఆమోదించాలని కోరినా ఆమోదించకపోవడం కుట్ర రాజకీయం కాదా అన్నారు. వెంటనే రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికలు వస్తాయని, బండారం బయటపడుతుందని రాజీనామాపై హైడ్రామాలు అన్నారు.
నవ నిర్మాణ దీక్షలను విజయవంతం చేయాలి
వారంపాటు జరిగే నవ నిర్మాణ దీక్షలను విజయవంతం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చివరి రోజు మహా సంకల్పం తీసుకోవాలన్నారు. అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. నాలుగేళ్ల పాలనపై ప్రజల్లో 76 శాతం సంతృప్తి ఉందని, నవ నిర్మాణ దీక్షలతో ప్రజల్లో సంతృప్తిని మరో ఐదు శాతం పెంచాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు సుస్థిర అభివృద్ధి చెందాలని, దీని కోసం తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు.కేంద్రం తోడ్పాటు లేకపోయినా నాలుగేళ్లలో ఎంతో చేశామన్నారు. వందశాతం విద్యుత్, గ్యాస్ ఇచ్చామని, వంద శాతం ఓడీఎఫ్ సాధించామన్నారు. విభజన జరిగిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విభజనతో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.