బీజేపీపై కావూరి ఆసక్తికర వ్యాఖ్య, మోడీ సాయం చేస్తే..: బాబు ఒలింపిక్స్ కల
విజయవాడ: బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అలాగే, ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని విమర్శించాలనుకోవడం సరికాదన్నారు.
ఆయన ఆదివారం ఉదయం కృష్ణా జిల్లాలోని విజయవాడలో పవిత్ర పుష్కర స్నానం ఆచరించారు. ఏపీ ప్రభుత్వం చేసిన పుష్కర ఏర్పాట్ల పైన ఆయన ప్రశంసలు కురిపించారు. పుష్కర ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు.
చిల్లర పడేయడం సరికాదు: రామ్మోహన్ నాయుడు
విభజన అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి చిల్లర వేసినట్టుగా రూ.1,900 కోట్ల సాయం చేయడం సరైన పద్ధతి కాదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడకు వచ్చిన ఆయన పున్నమి ఘాట్లో పుష్కర స్నానం చేసి అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఏపీకి కేంద్రం ఇచ్చిన సాయంపై మరింత స్పష్టత ఉండాలని, ఇది ప్యాకేజీగా ఇచ్చారా? హోదాకు ప్రత్యామ్నాయంగా ఇచ్చారా? అన్న విషయం కేంద్రం చెప్పాలన్నారు. హోదాపై కేంద్రం వైఖరి ఏమిటన్న విషయం తెలిసిన తర్వాతే తామేం చేయాలో నిర్ణయించుకుంటామన్నారు. హోదా రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అన్నారు. బీజేపీ స్వయంగా చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
కేంద్రం స్పష్టత ఇవ్వాలి, అమరావతిలో ఒలింపిక్స్ లక్ష్యం: బాబు
ఏపీకి ఏం అందించనున్నారన్న దానిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం అన్నారు. హోదా ఇస్తారా? ఇవ్వకపోతే అందుకు కారణాలేమిటన్నది చెప్పాలన్నారు. కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధులు వెనుకబడిన జిల్లాలకు ఏటా ఇచ్చేవేనని, రెవెన్యూ లోటు కింద ఇంకా చాలా నిధులు రావాల్సి ఉందన్నారు
ప్రస్తుతం విడుదల చేసినవి ఒక వాయిదా కింద ఇచ్చారా? అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి తక్కువ నిధులు వచ్చాయని, మిగతా నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
భవిష్యత్తులో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించాలన్నదే తన లక్ష్యమన్నారు. కేంద్రం సాయం చేసి, సహకరిస్తే ఈ కల తొందరగానే సాకరమవుతుందన్నారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
తాను స్థలం కేటాయించిన మైదానంలో శిక్షణ పొంది సింధూ పతకం సాధించడం గర్వకారణంగా ఉందని,అప్పట్లో గోపీచంద్ అకాడమీకి స్థలం కేటాయిస్తే దానిని రద్దు చేయాలని చాలా విధాలుగా ప్రయత్నించారని,ఒక్క అకాడమీకి స్థలం ఇవ్వడం వల్లే ఇన్ని ఫలితాలు సాధ్యపడ్డాయన్నారు. ఐఎంజీ వంటివి అప్పట్లో వచ్చి ఉంటే మరింత మంది అంతర్జాతీయ శిక్షకులు వచ్చి ఇంకా ఎన్నో పతకాలు సాధించేందుకు అవకాశముండేదన్నారు.