'కాపు'పై డొక్కా, రాజధాని వేరేచోట పెడ్తే మీ భూమి రేటు పెరిగేదా: రైతులపై బాబు సీరియస్!
హైదరాబాద్/గుంటూరు: కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కృతనిశ్యతంతో ఉన్నారని మాజీ మంత్రి, టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం నాడు చెప్పారు. బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
కాపులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని డొక్కా విమర్శించారు. ఆయన పరోక్షంగా ముద్రగడ పద్మనాభం, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు.
రాజధాని వేరేచోట పెడితే మీ భూముల రెట్లు పెరిగేవా: చంద్రబాబు
రాజధాని ప్రాంతంలో గ్రామకంఠాలను ఇవ్వమని చెబుతున్న కొందరు గ్రామాల రైతుల వ్యాఖ్యల పైన ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. రాజధానిని వేరేచోట పెడితే మీ భూముల ధరలు ఇంతలా పెరిగేవా అన్నారు. రైతుల భూముల ధరలు పెంచాలన్నదే తన ఉద్దేశ్యమని చంద్రబాబు చెప్పారు.
తాను పెట్టుబడులు తెచ్చేందుకే విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు సాధ్యమైనంత వరకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమను ఇక్కడి నుంచి కదిలించొద్దు, మమ్మల్ని ఉన్నచోట నుంచి వెళ్లమనొద్దు అని చెబితే ఎలా అని ప్రశ్నించారు.
కొందరి కారణంగా అభివృద్ధి ఆగిపోవద్దన్నారు. విశాల ప్రయోజనాల కోసం ప్రజలు ఆలోచించాలన్నారు. చిన్న చిన్న సమస్యల కోసం విశాల ప్రయోజనాలను పక్కన పెట్టవద్దన్నారు. తన దావోస్ పర్యటనప్రెజర్ ట్రిప్ ఏమీ కాదని చెప్పారు. అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా ఐఏఎస్ రావత్కు ప్రమాదం జరిగిందని, ఆపరేషన్ అయిందని చెప్పారు.