గుంటూరు మరణాలపై బాబు ఆగ్రహం, వార్నింగ్: ‘పవన్! సినిమా కాదు, భయపెట్టొద్దు’
అమరావతి: అతిసార వ్యాధితో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు దుర్ఘటన శాఖాపరమైన వైఫల్యమని మండిపడ్డారు.
ఒక వ్యక్తి వైఫల్యం పదిమంది మృతికి కారణం కావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించలేక పోవటంతో పాటు, పరిహారం కూడా అందించలేక పోయారని సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్పందించరా? హుధుద్ స్ఫూర్తి ఏది?
అతిసార మరణాలపై శనివారం మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు.. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తు వస్తే దానిని చక్కదిద్దేవరకూ వదిలిపెట్టకూడదని, విశాఖలో హుధుద్ అప్పుడు వ్యవహరించిన స్ఫూర్తి గుంటూరులో ఏమైందని ప్రశ్నించారు. స్థానికంగా వైఫల్యం చెందితే ఉన్నతస్థాయి యంత్రాంగం చక్కదిద్దకుండా ఏం చేస్తోందంటూ చంద్రబాబు నిలదీశారు.
కేసుల మాఫీ! జగన్ పార్టీని ఎవరూ నమ్మడం లేదు: మహాకుట్ర అంటూ బాబు సంచలనం
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
అధికార యంత్రాంగం పనితీరు ప్రభుత్వ గౌరవం పెంచేదిగా ఉండాలని, తప్పు జరగకూడదని.. ఒకవేళ జరిగితే సకాలంలో సమర్థంగా సరిదిద్దాలని అన్నారు. ఉదాసీనత, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు. రోడ్లు తవ్వడం, గుంతలు అలాగే వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయనే కనీస స్ఫృహ లేకుండా మున్సిపల్ శాఖ పనిచేస్తోందా? అంటూ సీఎం నిలదీశారు. పైపులైన్ల లీకేజీలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మురుగు కాలువలన్నీ శుభ్రపరచాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత పైపులైన్లు తొలగించి కొత్తలైన్లు వేయాలన్నారు.
చంద్రబాబు హెచ్చరిక
పట్టణ ప్రజల ఆరోగ్య రక్షణ బాధ్యత అధికార యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖ,వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంగా పనిచేయాలని సూచించారు.తాగునీటి నమూనాలు సేకరించాలని.. సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కారాదని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. సెన్సార్ ద్వారా నీటి కాలుష్యంపై పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
పవన్.. సినిమా కాదు
ఇది ఇలా ఉండగా, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లీకేజీ నిర్మాణాలను పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై నారాయణ మండిపడ్డారు. 48గంటల డెడ్లైన్ పెట్టడానికి ఇదేం సినిమా కాదని అన్నారు. ఘటనపై కమిటీ వేశామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
భయాందోలనలకు గురిచేయొద్దు పవన్..
ప్రజలను భయాందోళనలకు గురిచేయవద్దని పవన్కు మంత్రి నారాయణ సూచించారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలకు ఇబ్బందని అన్నారు. ముందు సమస్యపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.