ఎంపీ కొడుకు వీరంగంపై బాబు సీరియస్: తననే కొట్టారని అంబరీష్, కిష్టప్ప వత్తాసు(వీడియో)
అమరావతి: హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి అంబరీష్ దాడి చేసిన విషయం తెలిసిందే. టోల్ రూమ్ అద్దాలను పగులగొట్టి, కంపూటర్లను, ఫర్నీచర్ను ధ్వంసం చేశాడు. అంతేకాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
కర్ణాటకలో టీడీపీ ఎంపీ కొడుకు వీరంగం: టోల్గేట్పై దాడి, కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం
చంద్రబాబు సీరియస్
ఈ ఘటనపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన సీఎం చంద్రబాబు.. సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసుశాఖను ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేదిలేదని సీఎం స్పష్టం చేశారు.
నా కొడుకు తప్పులేదు: ఎంపీ కిష్టప్ప
టోల్ గేట్పై జరిగిన ఘటనతో తన కుమారుడు అంబరీష్ తప్పేమీ లేదని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తెలిపారు. అయితే, టోల్ ప్లాజా ఘటనపై తాను చింతిస్తున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాగేపల్లి వద్ద సిబ్బంది ఉద్దేశపూర్వకంగా అన్యాయాలకు పాల్పడుతుంటారని ఆరోపించారు. ఏపీ ప్రజాప్రతినిధులంటే వారికి గౌరవం లేదని, ఏపీ వీఐపీలు ఎవరు ఆ దారిలో వెళుతున్నా కావాలనే అడ్డుకుంటారని చెప్పారు.
నేనూ ఇబ్బంది పడ్డా..
గతంలో తాను వెళ్లినప్పుడు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానన్నారు. ఇదే విషయమై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తనతోపాటు చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు గతంలో ఫిర్యాదులు చేశారని తెలిపారు. దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల దగ్గర రౌడీయిజం సర్వసాధారణమైపోయిందని, నిర్దేశించిన రుసుముల కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని కిష్టప్ప తెలిపారు. సాధారణ ప్రజలు కూడా టోల్ సిబ్బంది తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి అన్యాయాలను అరికట్టాల్సిన అవసరముందని, కేసును విచారిస్తున్న పోలీసులకు తాను సహకరిస్తానని చెప్పారు.
నన్నే కొట్టారు: టోల్ గేట్ సిబ్బందిపై అంబరీష్ ఫిర్యాదు
తనపైనే దాడి చేశారంటూ.. బాగేపల్లి టోల్ గేట్పై దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు నిమ్మల అంబరీష్.. టోల్ గేట్ సిబ్బందిపైనే ఫిర్యాదు చేశాడు. సోమవారం మధ్యాహ్నం బాగేపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన.. టోల్ సిబ్బంది తనపై దాడికి దిగి కొట్టారని, అందువల్లే తాను భయంతో సమీపంలోనే ఉన్న టీడీపీ కార్యకర్తల సహాయం కోరినట్లు తెలిపాడు.
దాడి జరిగిందిలా..
అయితే, వారు వచ్చి ఏం చేశారో తనకు తెలియదని చెప్పారు అంబరీష్. టోల్ ప్లాజాపై జరిగిన దాడి వెనుక తాను లేనని అన్నారు. గేటు వద్ద తనను అకారణంగా అడ్డుకున్నారని, వారు అధికమొత్తం అడిగినందుకే తాను వాదించాల్సి వచ్చిందని చెప్పారు. అంబరీష్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. ఘటనలో ఎవరిది తప్పని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.