చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలి: అఖిలపక్ష భేటీలో నేతలు, ఎవరేం చెప్పారంటే
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయాలని అఖిల పక్ష నేతలు మంగళవారం సూచించారు. సచివాలయంలో జరిగిన అఖిల పక్ష భేటీ ముగిసింది. చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయాలని పలువురు సూచించినట్లుగా తెలుస్తోంది.
అఖిలపక్షం.. రాత్రికి రాత్రే మారిన రాజకీయాలు: బాబు కీలక వ్యాఖ్యలు, నిన్నటి వరకు కేసులు పెట్టి..
ప్రత్యేక హోదా కోసం తమ ఉద్యమం తాము చేసుకుంటామని, మీ ఉద్యమం మీరు చేసుకోవాలని లెఫ్ట్ పార్టీలు చెప్పాయి. హోదా కోసం ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈ సందర్భంగా విభజన నాటి పరిస్థితులను, అందులో తమ తప్పులేదని చెప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది.
అయితే, ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడాలని, అలా పాతవి చెప్పాలంటే తాము చాలా చెబుతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్ అన్నారు. అఖిల పక్షానికి రాని నేతలను మళ్లీ ఆహ్వానించాలని చలసాని శ్రీనివాస్ సూచించారు. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీలో ధర్నా చేపట్టడమే మంచిదని పలువురు సూచించారు.
కాగా, ఈ భేటీలో హోదా సమయంలో ఉద్యమించిన వారిపై కేసులు ఉపసంహరించేందుకు చంద్రబాబు అంగీకరించారు. ప్రధాని మోడీ కాళ్లకు విజయసాయి నమస్కరించిన అంశం చర్చకు వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ కంటే ముందే వైసీపీ మద్దతిచ్చిందని సీపీఐ రామకృష్ణ అన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటన్నారు. ఇన్నేళ్ల రాజకీయంలో ఇలాంటి కేంద్రాన్ని చూడలేదని సీపీఎం మధు అన్నారు.