జగన్పై దాడి జరిగితే.. మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?: చంద్రబాబు ఆగ్రహం, ‘తక్కువ అంచనావేయొద్దు’
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి విషయంలో వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
'అంతా జగన్ నాటకం: దాడి వారిద్దరి ప్లానే..మోడీయే డైరెక్టర్'!
మమ్మల్ని ఏ1, ఏ2లంటారా?
జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో తనను ‘ఏ1' అని, డీజీపీని ‘ఏ2' అంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ ద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ సమీక్షలో భాగంగా వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు.
కేంద్రం వైఖరితో కొత్త సమస్యలు
ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కారణంగా కొత్త సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. కాగా, ఈ సమీక్షలో పాల్గొన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొన్ని మీడియా ఛానెళ్లు పనిగట్టుకుని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాయని, ఇటువంటి ఛానెళ్లను నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని, మీడియాను సక్రమంగా వినియోగించుకుని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సూచించారు.
నన్ను తక్కువ అంచనా వేయొద్దు
నేర నియంత్రణపై గట్టి నిఘా ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు, మహిళలపై లైంగికదాడులను అదుపు చేసేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. అంతేగాక, ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు... రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ..' చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘చంపాలనే దాడి, జగన్ తప్పించుకున్నారు': విమానాశ్రయంలో ఏం జరిగిందంటే..?
ఢిల్లీలో చంద్రబాబు మీడియా సమావేశం
కాగా, శనివారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమై వెళ్తున్నారు. మరోవైపు శనివారం ఉదయం 10 గంటల కల్లా టీడీపీ ఎంపీలంతా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందుగా ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఐటీ దాడులు, జగన్పై దాడి ఘటన, కేంద్రం సహాయ నిరాకరణపై టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు.