మైండ్గేమ్ : ఎంపీలు బీజేపీలోకి వెళ్లడంపై చంద్రబాబు స్పందన ఇదీ..!
అమరావతి: ఏపీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. టీడీపీ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాషాయ కండువా కప్పుకున్న వారిలో ఇద్దరిపై పలు ఆర్థికపరమైన కేసులు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వారిపై ఐటీ దాడులు, సీబీఐ విచారణలు జరిగాయి. అయితే తాజాగా వారు పార్టీ మారడం వెనక చంద్రబాబు హస్తం కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు స్పందించారు.
పార్టీని వీడిన నేతలు భవిష్యత్తులో పశ్చాత్తాపపడుతారు
ముగ్గురు ఎంపీలు పార్టీని ఫిరాయించి బీజేపీలో చేరడంపై టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు బీజేపీతో టీడీపీ పోరాడిందని అది మనస్సులో పెట్టుకునే కమలం పార్టీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం విదేశీపర్యటనలో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ మారిన నేతలు భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి ఉంటుందన్నారు. స్వార్థం కోసం కొందరు నేతలు పార్టీ మారినప్పటికీ తెలుగుదేశంకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పిన చంద్రబాబు పార్టీ జెండాను మోసేందుకు కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని గుర్తు చేశారు.
బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది..కార్యకర్తలు తిప్పికొట్టాలి
బీజేపీలో చేరి రాష్ట్రప్రయోజనాలకు పోరాడుతామని పార్టీమారిన నేతలు చెప్పడం అవకాశవాదానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగువారాలకే బీజేపీ కుటిల రాజకీయాలకు తెరలేపుతోందని మండిపడ్డారు. బీజేపీ మైండ్గేమ్ స్టార్ట్ చేసిందని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీలో సంక్షోభాలు కొత్తకాదని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి... 37ఏళ్ల చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అన్నిటినీ ధీటుగా ఎదుర్కొని విజయం సాధించిందని గుర్తుచేశారు. ప్రజలు, కార్యకర్తలు ఇబ్బందులు వచ్చిన సమయంలో అండగా ఉండి కాపాడుకున్నారని చెప్పిన చంద్రబాబు..టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూసినా, చీలికలు తీసుకురావాలని ప్రయత్నం చేసినా కార్యకర్తలు ప్రజలే పార్టీకి కవచాలుగా మారి కాపాడుకుంటారని అన్నారు. సంక్షోభం ఎదురైనప్పుడు పార్టీ మరింత బలపడిందని గుర్తుచేశారు చంద్రబాబు.కార్యకర్తలు నిబ్బరంగా ఉండి, పార్టీపై జరుగుతున్న రాజకీయదాడులను, భౌతిక దాడులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలని పిలుపునిచ్చారు.
తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేద
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ప్రజావేదికను స్వాధీనం చేసుకోవడం దారుణమని మండిపడ్డారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. కనీస సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం సరికాదన్నారు. నాలుగు రాజ్యసభ ఎంపీల విలీనం నిబంధనల ప్రకారం కుదరదని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. అయితే దీనిపై న్యాయసలహాలు కూడా తీసుకుంటున్నామని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజూ జరుగుతున్న ప్రచారంపై స్పందించాల్సిన అవసరం లేదని ఇప్పటికే ఆ వార్తలపై స్పష్టత ఇచ్చినట్లు చెప్పిన ప్రత్తిపాటి పుల్లారావు.... తన నిజాయితీని ప్రతిరోజూ నిరూపించుకోవాలా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబే వారిని పార్టీమారేలా చేసి మొసలికన్నీరు కారుస్తున్నారు: వైసీపీ
ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపులపూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైసీపీ ధ్వజమెత్తింది. చంద్రబాబు బినామీలు అయిన సుజనాచౌదరి, సీఎం రమేష్లు సురక్షితంగా ఉండాలంటే బీజేపీ కండువా కప్పుకోవాలని సూచించింది చంద్రబాబే అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సీఎం రమేష్, సుజనాచౌదరీలపై పలు కేసులున్నాయని వాటినుంచి బయటపడాలంటే కమలం పార్టీ కండువా కప్పుకుంటేనే బయటపడే అవకాశముందన్న సలహా ఇచ్చి వారిని అక్కడికి పంపారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఏమీ తెలియనట్లు చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీస్తున్నారని ధ్వజమెత్తింది. వైసీపీ ఎమ్మెల్యేలను దగ్గరుండి కొనుగోలు చేసినప్పుడు చంద్రబాబు చెబుతున్న నైతిక విలువలు గంగలో కలిశాయా అంటూ ప్రశ్నిస్తోంది. చంద్రబాబు కోటరీలో అత్యంత దగ్గర వ్యక్తులైన సుజనా చౌదరీ, సీఎం రమేష్లు బీజేపీలో చేరారంటే ఇటు సొంతపార్టీ టీడీపీలో అటు ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.