జగన్పై చంద్రబాబు నిప్పులు.. కొడాలి నానిపై కూడా.. అందరినీ వేధిస్తున్నారని..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కక్షసాధింపు, ప్రజలపై వేధింపులకు పాల్పడిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లీం మైనార్టీ వర్గాల ప్రజలు వైసీపీ వేధింపులతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమన్వయ సమావేశం నిర్వహించారు.
గతంలో ఎన్నడూ ఇలా లేదు..
దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండన ఘటనలో గతంలో ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుపై కోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. అక్రమాస్తుల కేసులో ఇంప్లీడ్ అయ్యారని ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు కుటుంబాలపై జగన్ కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు. సింహాచలం ఆలయంతో ప్రారంభమైన ఆలయాలపై దాడి.. చివరికి తిరుమల వరకు వచ్చారు.
చీరాలలో దారుణం..
మాస్క్ లేదని చీరాలలో ఓ యువకుడిని చంపేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇళ్ల స్థలాల పేరుతో రూ.4వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు అంటున్నారని.. కానీ.. ప్రజలు నమ్మబోరన్నారు. మాస్క్ అడిగిన పాపానికి ఓ దళిత డాక్టర్ సుధాకర్పై కక్ష గట్టారని గుర్తుచేశారు. ఈ కేసులో అనుమానాలు ఉన్నాయని, కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
Recommended Video
మంత్రి మాటలు..
మంత్రి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. రథాలు కాలిపోతే కొత్తవి తయారుచేయిస్తామని.. వెండి సింహం బొమ్మలు పోతే కొత్తవి కొంటామని అనడం ఏంటీ అని ధ్వజమెత్తారు. ఆంజనేయస్వామి బొమ్మ చేయి నరికితే స్వామికి వచ్చిన నష్టం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దీని వెనకాల చీకటి అజెండా ఒకటి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మత మార్పిడులు పెంచి ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.